దక్షిణాది అగ్ర కథానాయికల్లో ఒకరిగా కొనసాగుతున్నది నయనతార. అభిమానులు ఆమెను లేడీ సూపర్స్టార్ అని అభివర్ణిస్తారు. గత కొన్నేళ్లుగా మహిళా ప్రధాన చిత్రాల ద్వారా తిరుగులేని ఫాలోయింగ్ను సంపాదించుకుందీ భామ. దక్షిణాదిన అత్యధిక పారితోషికం అందుకుంటున్న కథానాయిక నయనతారే కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ భామ తెలుగులో ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని చేయబోతున్నట్లు తెలిసింది. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించబోతున్న ఈ సినిమా కోసం నయనతారకు భారీ పారితోషికాన్ని ఆఫర్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. కథలోని కొత్తదనం నచ్చడంతో నయనతార కూడా ఈ ప్రాజెక్ట్పై ఆసక్తిగా ఉందని చెబుతున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే అంటున్నారు. ప్రస్తుతం నయనతార తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది.