Nayanthara | ఎవరు ఔనన్నా.. కాదన్నా సౌత్ సినీ ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరోయిన్ నయనతార అనే చెప్పాలి. ఈమె సౌత్లోనే కాకుండా నార్త్లోనూ మంచి క్రేజ్ ఉంది. అందుకే అటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే.. స్టార్ హీరోల సినిమాల్లోనూ మెప్పిస్తోంది. లేడీ సూపర్స్టార్గా పేరు తెచ్చుకున్న నయన్.. తమ సినిమాలో ఉంటే కలెక్షన్లు ఆటోమేటిగ్గా వచ్చేస్తాయని ప్రొడ్యూసర్స్కు కూడా ఓ నమ్మకం ఉంది. ఆ విశ్వాసంతోనే ఆమె అడిగినంత రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు కూడా ప్రొడ్యూసర్స్ సిద్ధంగా ఉంటున్నారు. కేవలం సినిమాలో కాదు.. 50 సెకండ్ల యాడ్ కోసం కూడా వాణిజ్య సంస్థలు నయనతారకు భారీగా పారితోషికం ముట్టజెబుతున్నారట. ఈ విషయం ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది.
ఇన్ని రోజులు సౌత్ సూపర్స్టార్గానే ఉన్న నయనతార గత ఏడాది జవాన్ సినిమాతో బాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. షారుక్ ఖాన్తో నటించేందుకు దాదాపు 10 కోట్ల వరకు నయన్ డిమాండ్ చేసింది. నయన్ క్రేజ్ చూసిన మేకర్స్ ఆమె అడిగినంత ఇచ్చేశారు. జవాన్ సినిమా రిలీజైనప్పుడు నయనతార పారితోషికం హాట్ టాపిక్గా మారింది. ఇదిలా ఉంటే ఈమె అడ్వర్టయిజ్మెంట్ల కోసం తీసుకునే రెమ్యునరేషన్ కూడా ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఎందుకంటే ఆమె 50 సెకండ్ల యాడ్ కోసం ఏకంగా రూ.5 కోట్ల వరకు పారితోషికం తీసుకుందని తెలుస్తోంది.
వరుస సినిమాల కారణంగా కొద్దిరోజులుగా నయనతార వాణిజ్య ప్రకటనలకు దూరంగా ఉంటూ వచ్చింది. ఈ క్రమంలో ఈమె టాటా స్కైతో పాటు, స్లైస్ మామిడి రసం యాడ్స్లో నటించింది. ఈ ప్రకటనల్లో నటించడానికి రూ.5 కోట్ల చొప్పున రెమ్యునరేషన్ తీసుకుందని తెలియడంతో అందరూ అవాక్కవుతున్నారు. కేవలం 50 సెకండ్ల నిడివి ఉండే ఒక్కో యాడ్ కోసం రూ.5 కోట్లు తీసుకుందని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ఈ వార్త సోషల్మీడియాలో వైరల్గా మారగా.. అది నయనతారకు ఉన్న డిమాండ్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.