అగ్ర కథానాయిక నయనతార ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అన్నపూరణి’. నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. గత డిసెంబర్ 29న ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమా ఇటీవల వివాదాస్పదమైంది. ‘అన్నపూరణి’ నయనతార 75వ సినిమా. ‘ది గాడెస్ ఆఫ్ ఫుడ్’ అనేది ఈ చిత్రానికి ఉప శీర్షిక. సంప్రదాయ కుటుంబంలో పుట్టిన అమ్మాయి చెఫ్గా ఎదగాలనే తన కలను ఎలా సాకారం చేసుకుంది? అనే కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు. ఇటీవల నెట్ఫ్లిక్స్లో విడుదల కాగా, ఇందులో కొన్ని సన్నివేశాలు మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ చిత్రాన్ని ఓటీటీ నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై నయనతార స్పందించారు.
“బరువెక్కిన హృదయంతో ఈ ప్రకటన చేస్తున్నా. మంచి ఆలోచనతో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ‘అన్నపూరణి’ సినిమాను రూపొందించాం. సెన్సార్ బోర్టు సర్టిఫికెట్ ఇచ్చిన ఈ సినిమాను ఓటీటీ వేదిక నుంచి తొలగిస్తారని ఊహించలేదు. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చని తెలియజేసేందుకు ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ ప్రయత్నంలో మాకు తెలియకుండానే కొందరి హృదయాలు గాయపడ్డాయి. మా చిత్రబృందం సహా నేను ఎవరి మనోభావాలను దెబ్బ తీయాలని అనుకోలేదు. నేను ఉద్ధేశపూర్వకంగా ఇలా చేయలేదు. మీ మనోభావాలను గాయపర్చినందుకు క్షమించండి. ఈ చిత్ర ప్రధాన ఉద్ధేశం ఎవరినీ కించపర్చడం కాదు. నా 20 ఏళ్ల కెరీర్లో సానుకూలతను వ్యాప్తి చేయాలనే చూశాను’ అని పేర్కొన్నారు.