ఏడేళ్ల ప్రేమబంధం..ఏడడుగులు నడిచి సరికొత్త జీవన మజిలీకి శ్రీకారం చుట్టింది. అగ్ర కథానాయిక నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేష్శివన్ గురువారం వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ జంట కల్యాణం చెన్నై దగ్గర మహాబలిపురంలోని షెరిటన్ హోటల్లో కన్నులపండువగా జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అగ్ర హీరోలు రజనీకాంత్, షారుఖ్ఖాన్, విజయ్, సూర్య, విజయ్సేతుపతి, అజిత్, ప్రముఖ దర్శకుడు మణిరత్నం, అట్లి, రాధికా శరత్కుమార్ దంపతులు, బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ తదితరులు నూతన జంటకు శుభాకాంక్షలందజేశారు. ఇక సోషల్మీడియా వేదికగా కొత్త దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
ఇన్స్టాగ్రామ్లో పెళ్లి ఫొటోలు
పెళ్లికి సంబంధించిన ఫొటోలను విఘ్నేష్శివన్ గురువారం సాయంత్రం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘దేవుడి దయ..నా తల్లిదండ్రుల, సన్నిహితుల ఆశీస్సులతో మేము వివాహ బంధంలోకి అడుగుపెట్టాం. ఈ పెళ్లితో మరో గొప్ప ప్రేమకథకు శ్రీకారం చుట్టబోతున్నాం’ అని విఘ్నేష్శివన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన అర్ధాంగి నుదిటిపై విఘ్నేష్శివన్ ముద్దుపెడుతున్న ఫొటో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది.