హైదరాబాద్: రమ్య రఘుపతితో తనకు ఎలాంటి సంబంధం లేదని సీనియర్ నటుడు నరేష్ (Naresh) స్పష్టం చేశారు. గత ఐదారేండ్లుగా తామిద్దరం దూరంగా ఉంటున్నామని చెప్పారు. వేర్వేరుగా ఎవరి బతుకు వాళ్లం బతుకుతున్నామని వెల్లడించారు. ఇప్పుడు ఆమె వ్యాపార లావాదేవీలు, అప్పుల సమస్యల గురించి వస్తున్న వార్తల్లో తన భాగస్వామ్యం లేదని స్పష్టం చేశారు. మూడు నెలల క్రితమే రమ్యకు నోటీసులు ఇచ్చానని, తనకు గాని, తన కుటుంబ సభ్యులకు గాని ఎలాంటి సంబంధం లేదని కొద్ది రోజుల క్రితమే పేపర్లో ప్రకటన కూడా ఇచ్చానని తెలిపారు.
అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంటికి వచ్చేవారని, ఆ సమయంలో రమ్యను హెచ్చరించానని.. కానీ ఆమెలో మార్పు రాలేదని చెప్పారు. రమ్య వసూలు చేసిన డబ్బులకూ, తనకూ ఎలాంటి సంబంధం లేదన్నారు. రెండు రోజులుగా చాలా మంది కాల్ చేసి వివరణ అడుగుతున్నారని.. ఫైనాన్స్ వ్యవహారంలో తన ప్రమేయం లేదన్నారు.
కాగా, రమ్య రఘుపతి ఉన్నతి అరోమా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వ్యాపారం చేస్తున్నది. దీనికోసం పలువురి వద్ద డబ్బులు తీసుకుని ఎగ్గొట్టినట్లు బాధితులు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.