సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారి హత్యాచార నిందితుడు రాజు కోసం పోలీసులు కొద్ది రోజులుగా గాలిస్తున్నారు.ఆయన ఆచూకీ ఇంతవరకు తెలియకపోవడంతో నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రివార్డ్ అందిస్తామని సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. పోలీసులు నిందితుడి ఆనవాళ్లను విడుదల చేశారు. పది బృందాలను ఏర్పాటు చేసి రాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే నిందితుడిని ఎన్ కౌంటర్ చేయాలని, అతడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్లు పెరిగిపోతున్నాయి. సెలబ్రిటీలు సైతం రాజుకి కఠిన శిక్షలు వేయలని కోరుతున్నారు.ఇప్పటికే మంచు మనోజ్, మహేష్ బాబు తమ సోషల్ మీడియా ద్వారా రాజు అనే నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయగా, తాజాగా నాని కూడా స్పందించారు.
తెలంగాణ పోలీస్ ట్వీట్ని షేర్ చేస్తూ.. బయటెక్కడో ఉన్నాడు, ఉండకూడదు అంటూ తన స్పందన తెలియజేశారు. సామాన్యులు, సెలబ్రిటీలు ఇంత దారుణానికి ఒడిగట్టిన దుర్మార్గుడికి కఠిన శిక్ష వేయాలని కోరుతున్నారు. కాగా, యాదాద్రి భువనగిరి జిల్లా చందంపేట్ మండలానికి చెందిన పల్లకొండ రాజు జీవనోపాధి కోసం హైదరాబాద్ వచ్చాడు. ఆటో డ్రైవర్ గా పని చేస్తునే చోరీలకు పాల్పడేవాడు. సైదాబాద్ ఏరియాలో చుట్టుపక్కల వారితోనూ నిందితుడు చాలా దురుసుగా ప్రవర్తించేవాడు. చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి దారుణానికి ఒడిగట్టాడు.