నేచురల్ స్టార్ నాని మంచి స్పీడ్ మీదున్నాడు. నాని నటించిన టక్ జగదీష్ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా, రిలీజ్కు సిద్ధంగా ఉంది. పరిస్థితులు సద్ధుమణిగాక థియేటర్స్లో మూవీని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ‘శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి చిత్ర షూటింగ్స్తో బిజీగా ఉన్నాడు నాని. కరోనా వలన ఆగిన ఈ చిత్ర షూటింగ్స్ తిరిగి మొదలయ్యాయి.
‘టాక్సీవాలా’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ శ్యామ్ సింగరాయ్ చిత్రం తెరకెక్కిస్తున్నాడు. 1960-70 కాలం నేపథ్యంలో తెరకెక్కుతోండగా, కరోనా వలన చిత్ర షూటింగ్ ఆగింది. ఇప్పుడు కరోనా కాస్త శాంతించడంతో తిరిగి మొదలు పెట్టారు. ఇప్పటికే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ మొత్తం పూర్తి చేయగా, తాజాగా మొదలు పెట్టిన షెడ్యూల్ లో ప్రస్తుత జనరేషన్కి సంబంధించిన సీన్స్ తెరకెక్కిస్తున్నారట. ఫైనల్ షెడ్యూల్ ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా స్టెబాస్టియన్ హీరోయిన్స్గా నటిస్తున్నారు.