Nandamuri Tarakaratna | టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర సమయంలో తీవ్ర అస్వస్థతకు లోనైన సినీనటుడు తారకరత్నకు ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్న విషయం తెలిసిందే. తారకరత్న తాజా ఆరోగ్యపరిస్థితిపై నందమూరి రామకృష్ణ అప్డేట్ అందించారు. ఆయన ఇవాళ బెంగళూరులో ఆస్పత్రి ప్రాంగణంలో రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. డాక్టర్ శెట్టి నేతృత్వంలోని బృందం తారకరత్నకు చికిత్సనందిస్తోందన్నారు.
నారాయణ హృదయాలయ ఆస్పత్రి డాక్టర్లు చాలా కష్టపడి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. తారకరత్న ప్రస్తుతం సొంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారు. క్రమక్రమంగా కోలుకుంటున్నారు. ఇవాళ ఉదయం సీటీ స్కాన్ చేశారు. ఇంకా రిపోర్ట్ రావాల్సి ఉంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత మెదడు పనితీరుపై స్పష్టత వస్తుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. తారకరత్న మీ అందరి ఆశీస్సులతో త్వరలోనే సంతోషంగా బయటకు వస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. చికిత్స కోసం ఎక్మో పరికరాన్ని అమర్చారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు.
ఇటీవలే కుప్పం నియోజక వర్గ కేంద్రం నుంచి నారా లోకేశ్ ప్రారంభించిన పాదయాత్రలో పాల్గొన్న సమయంలో తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురవగా.. వెంటనే కుప్పం నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించి చికిత్సనందించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తారకరత్నను డాక్లర్ల బృందం అర్థరాత్రి గంటన్నర సమయంలోనే తారకరత్నను హుటాహుటిన బెంగళూరుకు తరలించి చికిత్స కొనసాగిస్తోంది.