Nandamuri Tarakaratna | నందమూరి తారకరత్న మృత్యువుతో పోరాడుతున్నారు. గత 23 రోజుల నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో.. శనివారం సాయంత్రం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల అవుతుందని మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి హెల్త్ బులెటిన్ రాలేదు. దీంతో తారకరత్న అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
కుప్పంలో నారా లోకేశ్ చేపట్టిన యువగళం యాత్రలో తారకరత్న గుండెపోటుతో కుప్పకూలిన విషయం తెలిసిందే. యాత్ర ప్రారంభమైన కాసేపటికి సమీపంలో ఉన్న మసీదులోకి నారా లోకేశ్ వెళ్లారు. లోకేశ్తో పాటు తారకరత్న కూడా మసీదులోకి వెళ్లారు. ఆ సమయంలో టీడీపీ కార్యకర్తలు అంతా గుంపుగా తరలివచ్చారు. అందరూ ఒక్కసారిగా మీద పడ్డట్టు రావడంతో తారకరత్నకు ఊపిరి ఆడలేదు. ఇదే విషయాన్ని సిబ్బందికి చెప్పడంతో వాళ్లు.. టీడీపీ కార్యకర్తలను దూరంగా వెళ్లాలని సూచించారు. అయినప్పటికీ వాళ్లు వినిపించుకోలేదు. ఈ క్రమంలో ఊపిరాడక తారకరత్న సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే ఆయనకు ప్రాథమిక చికిత్స అందించి కుప్పం ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు తీవ్ర గుండెపోటుగా నిర్ధారించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రత్యేక అంబులెన్స్ ద్వారా బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించి చికిత్స అందిస్తున్నారు.