Nandamuri Tarakaratna | నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని బెంగళూరు నారాయణ హృదయాలయ వైద్యులు తెలిపారు. తారకరత్నకు ప్రత్యేక వైద్య నిపుణుల బృందం చికిత్స అందిస్తోంది. తారకరత్న ఆరోగ్య వివరాలను ఆయన భార్య అలేఖ్యా రెడ్డికి వైద్యులు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు.
తారకరత్న ఆరోగ్యం విషమంగానే ఉందని తెలుసుకున్న చంద్రబాబు.. బెంగళూరుకు చేరుకున్నారు. కాసేపటి క్రితం నారాయణ హృదయాలయ వైద్యులతో బాబు మాట్లాడి, తారకరత్న ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇక తారకరత్న తండ్రి మోహన కృష్ణ, పురంధేశ్వరి, సుహాసిని, పరిటాల శ్రీరామ్, మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వర్ రావు, చిన రాజప్పతో పాటు పలువురు నారాయణ హృదయాలయకు చేరుకున్నారు.
నాయకులతో పాటు నందమూరి అభిమానులు కూడా ఆస్పత్రి వద్దకు భారీ సంఖ్యలో తరలిరావడంతో.. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్న నారా లోకేశ్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న 15 నిమిషాలకే తారకరత్న స్పృహ కోల్పోయిన పడిపోయిన సంగతి తెలిసిందే. హుటాహుటిన కుప్పం ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ్నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం నిన్న రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు.