‘ఈ సినిమా చేయడానికి నాన్నగారే నాకు స్ఫూర్తి. రొటీన్కి భిన్నమైన సినిమా చేయాలనే ఉద్దేశ్యంతోనే ‘ఆదిత్య 369’ చేశాను. ఎస్పీబాలుగారు, నిర్మాత కృష్ణప్రసాద్గారు సారథులై నడిపించారు. ముందు చూపుతో ఆలోచించి సింగీతం శ్రీనివాసరావుగారు చేసిన అద్భుతం ఈ సినిమా. జనరేషన్స్ మారుతున్నా ఇంకా ‘ఆదిత్య 369’ని ఇష్టపడుతూనే ఉన్నారంటే ఆ సినిమా గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా సీక్వెల్కి సంబంధించిన కథ కూడా పూర్తయింది. ఇక మొదలుపెట్టడమే ఆలస్యం. దేశంలోని తొలి టైమ్ ట్రావెల్ మూవీగా చరిత్ర సృష్టించిన సినిమా ఇది’ అని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన కథానాయకుడిగా 1991లో రూపొందిన క్లాసిక్ మూవీ ‘ఆదిత్య 369’. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 4న రీరిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రీరిలీజ్ ఈవెంట్ని ఆదివారం హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినందుకు దర్శకులు అనిల్ రావిపూడి, కె.ఎస్.రవీంద్ర ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్, బాబుమోహన్ మాట్లాడారు.