మంగళవారం ముంబయిలో జరిగిన ‘కుబేర’ గీతావిష్కరణ కార్యక్రమంలో చిత్ర కథానాయిక రష్మిక మందన్న గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు అగ్ర నటుడు నాగార్జున. రష్మిక పవర్హౌజ్ అని ప్రశంసించారు. రష్మిక మందన్న గత చిత్రాల వసూళ్లను ఉద్దేశించి ‘మీరు ఆమె ఫిల్మోగ్రఫీని గమనించారా? కలెక్షన్ల విషయంలో ఆమె మా అందరినీ బీట్ చేసింది’ అని నాగార్జున అన్నారు. ప్రస్తుతం ఆయన మాటలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ‘కుబేర’ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ సందర్భంగా మంగళవారం ముంబయిలో ‘పీ పీ డుమ్ డుమ్..’ అనే గీతాన్ని ఆవిష్కరించారు. నాగార్జున మాట్లాడుతూ “నేను నటించిన శివ, క్రిమినల్ చిత్రాలను హిందీ ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. శేఖర్ కమ్ములతో 15ఏళ్లుగా పనిచేయాలనుకుంటున్నా. ఇప్పుడు కుదిరింది. ఇదొక డిఫరెంట్ సబ్జెక్ట్. కథ చెప్పగానే మరో ఆలోచన లేకుండా అంగీకరించా. ధనుష్ ప్రతీ సినిమాలో వైవిధ్యం చూపిస్తుంటారు. ఈ మూవీలో ఆయన అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనబరిచారు’ అన్నారు.
ఈ సినిమాలో తాను బిచ్చగాడి పాత్రలో కనిపిస్తానని, ఇలాంటి పాత్రను ఇప్పటివరకు చేయలేదని, గొప్ప ఫిలాసఫీతో కూడిన కథ ఇదని ధనుష్ తెలిపారు. రష్మిక మందన్న మాట్లాడుతూ ‘రియల్ లోకేషన్స్లో షూటింగ్ జరిపాం. నా క్యారెక్టర్ మీ అందరిని సర్ప్రైజ్ చేస్తుంది. పుష్ప, యానిమల్, ఛావా తరహాలో నా పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది’ అని చెప్పింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.