కథాంశాల పరంగా ప్రయోగాలు చేయడంలో, ఇండస్ట్రీలో నూతన ప్రతిభను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు అగ్ర హీరో నాగార్జున. సుదీర్ఘ కెరీర్లో ఆయన ఎంతో మంది కొత్త దర్శకులను పరిశ్రమకు పరిచయం చేశారు. తాజా చిత్రం ‘నా సామిరంగ’ ద్వారా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీని డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇదిలావుండగా నాగార్జున..సుబ్బు అనే మరో నూతన దర్శకుడితో సినిమా చేయబోతున్నట్లు తెలిసింది.
యదార్థ ఘటనల ఆధారంగా తయారుచేసుకున్న ఈ కథ నాగార్జునకు బాగా నచ్చిందని, కోర్ట్రూమ్ డ్రామా నేపథ్యంలో కథ నడుస్తుందని సమాచారం. సమకాలీన సామాజికాంశాలను చర్చిస్తూ చక్కటి సందేశం ఉన్న ఈ సినిమాలో నాగార్జున లాయర్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తున్నది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. నాగార్జున తాజా చిత్రం ‘నా సామిరంగ’ సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది.