నాగ చైతన్య హీరోగా నటిస్తున్న సినిమా ‘థ్యాంక్యూ’. రాశీ ఖన్నా, మాళవికా నాయర్ నాయికలుగా నటిస్తున్నారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో దర్శకుడు విక్రమ్ కె కుమార్ రూపొందిస్తున్నారు. నిర్మాణానంతర కార్యక్రమాల తుది దశలో ఉన్న ఈ సినిమా జూలై 8న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. తాజాగా చిత్ర టీజర్ను విడుదల చేశారు.
టీజర్లో నాగచైతన్య అభిరామ్ అనే సక్సెస్ఫుల్ బిజినెస్మేన్గా కనిపిస్తున్నారు. టీజర్ విడుదల సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ..‘అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న చిత్రమిది. మా సంస్థకు మరో వైవిధ్యమైన సినిమా అవుతుంది. నాగ చైతన్య, దర్శకుడు విక్రమ్ కాంబోలో కొత్త తరహా చిత్రాన్ని చూస్తారు. చైతూ అభిరామ్ అనే బిజినెస్మేన్ పాత్రలో కనిపిస్తారు.
గెలుపు పరుగులో ఆయన తన ప్రేయసిని, ఆమెతో అనుబంధానికీ దూరమవుతారు. తిరిగి ఆ ప్రేమను దక్కించుకునేందుకు తను చేసిన ప్రయత్నమేంటి అనేది ఆసక్తికరంగా ఉండబోతున్నది. జూలై 8న సినిమాను విడుదల చేయబోతున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి కథ : బీవీఎస్ రవి, ఎడిటర్ : నవీన్ నూలి, సినిమాటోగ్రఫీ : పీసీ శ్రీరామ్, సంగీతం : థమన్.