Naga Chaitanya | ఓటీటీ ప్రభావం సినిమాతో పోటీ పడుతున్న ఈ సమయంలో పేరున్న నటీనటులంతా డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య చేరాడు. సంక్రాంతి పండక్కి భారీ సినిమాలన్నీ భయపడి వెనక్కి తగ్గినా, చిన్న బంగార్రాజుగా.. బంగార్రాజు సినిమాలో సందడి చేసిన తర్వాత తొలిసారి చైతూ ఓ వెబ్ సిరీస్లో నటిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ను చైతూ ఫేవరేట్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ తెరకెక్కిస్తున్నాడు.
ఈ వెబ్ సిరీస్ను అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తున్నది. వెబ్ సిరీస్కు దూత అనే పేరును ఖరారు చేసినట్లు తాజా సమాచారం. హారర్ థ్రిల్లర్ కథతో దూత వెబ్ సిరీస్ను విక్రమ్ రూపొందిస్తున్నాడు. వెబ్ సిరీస్లో చైతూ ఎవరికి దూతగా వ్యవహరిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం నాగ చైతన్య, విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ లో థాంక్యూ అనే సినిమా తెరకెక్కుతోంది. రాశీ ఖన్నా నాయిక. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇటీవలే థాంక్యూ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. యూరప్ నుంచి టీమ్ వ్రాపప్ అంటూ ఫొటోలు షేర్ చేశారు. మనం లాంటి సూపర్ హిట్ సినిమా చేసిన కాంబినేషన్ కాబట్టి థాంక్యూ సినిమాపై అంచనాలు సహజమే. విక్రమ్ కె కుమార్ కొత్త ఐడియాలను తెరకెక్కిస్తాడనే పేరుంది. దూత వెబ్ సిరీస్లో కూడా ఏదో వైవిధ్యత ఉంటుందనే ప్రేక్షకులు ఆశిస్తున్నారు.