Naga Chaitanya | నాగచైతన్య కథానాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించబోతున్నారు. ప్రస్తుతం పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. మత్స్యకారుల కథాంశమిది. ఈ నేపథ్యంలో గురువారం హీరో నాగచైతన్య, దర్శకనిర్మాతలు చందు మొండేటి, బన్నీ వాసు శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని ఓ మత్స్యకార గ్రామానికి వెళ్లి అక్కడి కుటుంబాలను కలిశారు.
నాగచైతన్య మాట్లాడుతూ ‘యథార్థ సంఘటనల ఆధారంగా తయారు చేసుకున్న కథ ఇది. వినగానే స్ఫూర్తివంతంగా అనిపించింది. నా పాత్రలో సహజత్వం కనిపించాలంటే మత్స్యకారుల జీవితాలను ప్రత్యక్షంగా చూడాలనుకున్నా. అందుకే ఈ గ్రామానికి వచ్చాం’ అని తెలిపారు. 2018లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ కథను తయారు చేశామని దర్శకుడు చందు మొండేటి పేర్కొన్నారు. మత్స్యకారుల గ్రామం నేపథ్యంలో జరిగే అందమైన ప్రేమకథా చిత్రమిదని నిర్మాత బన్నీ వాసు తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించబోతున్నారు.