‘ఇందులో నా పాత్ర పేరు రత్నమాల. విశ్వక్ పాత్ర పేరు రత్నాకర్. ఇద్దరినీ అందరూ రత్న అని పిలుస్తుంటారు. నా ఆహార్యం, మాట్లాడే తీరు అన్నీ కొత్తగా ఉంటాయి. మనసుకు, నోటికీ ఫిల్టర్ ఉండదు. ఏది అనిపిస్తే అది అనేస్తుంటాను.’ అంటున్నది నటి అంజలి. విశ్వక్సేన్ కథానాయకుడిగా రూపొందిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రంలో ఆమె ఓ కథానాయిక. కృష్ణచైతన్య దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ నెల 31న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా అంజలి ఆదివారం విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించింది. ‘దర్శకుడు కృష్ణచైతన్య ఈ కథ చెప్పినప్పుడు.. రత్నమాల పాత్రకు నన్నెందుకు అనుకున్నారు? అని అడిగాను. నాకు అద్భుతంగా నటించే నటి కావాలి. అందుకే మీ దగ్గరకు వచ్చాను అన్నారు. ఏ నమ్మకంతో చెప్పారో తెలీదుకానీ.. ఇంతమంచి పాత్ర చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. నేను ఈ సినిమా అంగీకరించడానికి కారణం ఈ పాత్రలోని వైవిధ్యమే.’ అన్నారు అంజలి.
ఇంకా చెబుతూ ‘నా పాత్రలో వేరేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ పాత్రలోకి వెళ్లడానికి ఎక్కువ సమయం పట్టింది. నిజంగా విశ్వక్, నేనూ పోటీపడి నటించాం.’ అని తెలిపారు అంజలి. విశ్వక్సేన్తో నటించడం చాలా ఆనందంగా ఉందని, తను మంచి స్నేహితుడని, అందుకే అతనితో తేలిగ్గా నటించగలిగానని చెప్పారు అంజలి.