Mrunal Thakur | ‘సీతారామం’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది మరాఠీ సోయగం మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం ఈ భామ తెలుగుతో పాటు హిందీలో కూడా భారీ అవకాశాలను దక్కించుకుంటున్నది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో నాని, విజయ్ దేవరకొండ చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నది. ఈ సందర్భంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సహనటులపై ప్రశంసలు కురిపించింది మృణాల్ ఠాకూర్. వాళ్లందరూ ఎంతో మంచివాళ్లని, వారి పరిచయం వల్ల జీవితాన్ని కొత్త దృక్కోణంలో చూస్తున్నానని పేర్కొంది. ఆమె మాట్లాడుతూ “సీతారామం’ కోస్టార్ దుల్కర్ సల్మాన్ ద్వారా సంభాషణలను ఎలా చెప్పాలో నేర్చుకున్నా.
ఇప్పుడు ఎలాంటి పొరపాట్లు లేకుండా డైలాగ్స్ చెప్పగలననే నమ్మకం ఏర్పడింది. ఇక నాని చాలా సింపుల్గా ఉంటాడు. కెరీర్ అంటే పరుగుపందెం కాదని, అందరికంటే ముందుండాలనే కోరిక వల్ల మనశ్శాంతి కోల్పోతామని ఆయన ఎప్పుడూ చెబుతుంటారు’ అని చెప్పింది. ‘సీతారామం’ చిత్రం తన కెరీర్లో మైలురాయి వంటిదని..ఆ సినిమాలో అవకాశాన్నిచ్చిన దర్శకుడు హను రాఘవపూడికి జీవితాంతం కృతజ్ఞతగా ఉంటానని తెలిపింది . ప్రస్తుతం ఈ భామ తెలుగు, తమిళం, హిందీలో భాషల్లో ఐదు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.