Jaya Bachchan | 95వ అకాడమీ అవార్డ్స్ (Oscar Awards 2023)లో ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు సాంగ్, తమిళ డాక్యుమెంటరీ ది ఎలిఫెంట్ విస్పరర్స్ అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే. అయితే రెండు అవార్డులు సౌతిండియా రాష్ట్రాలకే రావడంతో.. అన్నాడీఎంకే, ఎండీఎంకే నేతలు సౌతిండియా వర్సెస్ నార్తిండియా చర్చను రాజ్యసభలో తెరపైకి తీసుకొచ్చారు. ఆస్కార్ ఘనత సౌతిండియాకే దక్కుతుందని అన్నారు. అయితే దీనిపై సమాజ్వాదీ పార్టీ ఎంపీ, నటి జయా బచ్చన్ (Jaya Bachchan) తనదైన శైలిలో ధీటైన సమాధానమిచ్చారు.
వాళ్లు (అవార్డు అందుకున్న) నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్ ప్రాంతం వాళ్లా అనేది విషయం కాదు.. వారంతా భారతీయులు. మన దేశానికి ఎన్నో సార్లు ప్రాతినిధ్యం వహించి, ఎన్నో అవార్డులు అందుకున్న మన సినీ సోదరుల పట్ల గౌరవంతో.. గర్వంగా ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానన్నారు. సినిమా మార్కెట్ ఇక్కడే ఉంది. అమెరికాలో లేదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే.. ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ ప్రతిభను గుర్తిస్తున్న పాశ్చాత్య దేశ వాసులతోపాటు భారత ప్రజలకు అభినందనలు తెలియజేయాలనుకుంటున్నట్టు చెప్పారు.
సత్యజిత్ రే 1992లో ఆస్కార్ను గెలుచుకున్న విషయాన్ని జయా బచ్చన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆర్ఆర్ఆర్ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఉత్తమ స్క్రీన్ రైటర్ మాత్రమే కాదు.. మంచి కథకుడు, మన సినీ సోదరుల సభ్యుడు కూడా కావడం గొప్ప గౌరవమని కొనియాడారు.