ఒకప్పుడు కొత్త సినిమా గురించి కొబ్బరికాయ కొట్టే మొదటి రోజు, గుమ్మడికాయ కొట్టే చివరి రోజు- ఈ రెండు తంతులకే ప్రచారం ఉండేది. కానీ, ఇప్పుడు ఏ పని చేసినా ప్రచారంలో తగ్గేది లేదు అంటున్నారు సినీ జనం. కొంతకాలం, హీరోల సినిమాలకు వర్కింగ్ టైటిళ్ల సంప్రదాయం ఫాలో అయ్యారు. ఇప్పుడు దాన్ని కాదని సదరు హీరో చేస్తున్న సినిమా సంఖ్యను భారీగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. సినిమా నంబర్కు హ్యాష్ట్యాగ్ తగిలించి సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తున్నారు. ఇంకేముంది.. సినిమా విడుదలయ్యే వరకూ హ్యాష్ట్యాగ్ చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఈ కొత్త సంప్రదాయంతో ఏ హీరో ఎన్నో సినిమా చేస్తున్నాడన్న సంగతి కూడా గుర్తుండిపోతున్నది.
‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ తర్వాతి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ముచ్చటగా మూడు సినిమాలకు తారక్ ఓకే చెప్పాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇంతకు ముందు వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ..’ చిత్రం ఓ మోస్తరు కలెక్షన్లు రాబట్టింది. దీంతో ఈసారి భారీ విజయంపై కన్నేశారు. మరోవైపు ఎన్టీఆర్ 30వ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 30
నంబర్ను ప్రధానంగా చూపుతూ అప్పట్లో విడుదల చేసిన వర్కింగ్ టైటిల్ సామాజిక మాధ్యమాల్లో ఇంకా చక్కర్లు కొడుతున్నది. కొరటాల శివ దర్శకత్వంలో భారీ యాక్షన్ చిత్రంగా ఇది రూపుదిద్దుకుంటున్నది. అయితే, సినిమాపై తాజాగా ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంపై తారక్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ‘ఆచార్య’ సినిమా భారీ పరాజయంతో కొరటాల ఈ చిత్రం స్క్రిప్ట్ను మరింత పకడ్బందీగా సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఆచార్య’ చేదు జ్ఞాపకాన్ని చెరిపివేసేలా కథను వండేపనిలో పడ్డాడట. ఇంతకుముందు కొరటాల, తారక్ కాంబి నేషన్లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ బాక్సాఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్లు వసూలు చేసింది. రాబోయే సినిమా అంతకుమించి ఉంటుందని చెబుతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో సినిమా విడుదల చేయనున్నట్టు టాక్. మరోవైపు ఎన్టీఆర్ 31వ చిత్రానికి ప్రశాంత్నీల్ దర్శకత్వం వహించనున్నాడు. తారక్ 30వ చిత్రం గురించి మాత్రం ఆయన ఫ్యాన్స్ కండ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు.
నేచురల్ స్టార్ నానికి ఈ మధ్య భారీ విజయం దక్కలేదు. ‘శ్యామ్సింగరాయ్’, ‘అంటే! సుందరానికీ..’ సినిమాలు సో.. సోగా ఆడాయి. ఈ క్రమంలో భారీ యాక్షన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నాడు నాని. అతని 29వ చిత్రంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ‘దసరా’ మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన టీజర్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఇదిలా ఉంటే నాని లేటెస్ట్ మూవీ అప్డేట్ కూడా వచ్చేసింది. #నాని 30 వర్కింగ్ టైటిల్తో విడుదలైన టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఇందులో ‘నాన్న నాన్న.. నీ గడ్డం నచ్చలే..!’ అని కూతురంటే.. ‘ఇది దసరా కోసం నాన్నా.. మన సినిమాలో ఉండదు’ అని నాని చెబుతాడు. టీజర్తో ఇది ఓ తండ్రీకూతుళ్ల కథ అని చెప్పకనే చూపించాడు దర్శకుడు. ఇక, ఈ సినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ కథానాయిక. దర్శకుడు శౌరి యూవీ. సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది.
‘అఖండ’ విజయం మరవకముందే ‘వీరసింహారెడ్డి’తో ప్రేక్షకులకు హైలెవల్ కిక్కిచ్చాడు బాలకృష్ణ. ఆయన తర్వాతి చిత్రంపై ఎప్పట్నుంచో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు కారణాలూ లేకపోలేదు! పక్కా మాస్ హీరో అయిన బాలకృష్ణను కామెడీకి కేరాఫ్గా ఉన్న అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండటంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. పటాస్, సుప్రీమ్, ఎఫ్2, రాజా దిగ్రేట్, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్3 ఇలా.. వరుస విజయాలతో రెండు హ్యాట్రిక్లు కొట్టాడు అనిల్. ఆయన సినిమాల్లో కామెడీ పాలు ఎక్కువే ఉన్నప్పటికీ, యాక్షన్ సన్నివేశాల్లోనూ తన మార్కు చూపించగలడన్న పేరుంది. దీంతో బాలయ్యతో ఎలాంటి సినిమా చేయబోతున్నాడని అందరూ ఎదురుచూస్తున్నారు. పైగా బాలకృష్ణ 108వ సినిమా కావడంతో అభిమానుల ఎదురుచూపులు రెట్టింపు అయ్యాయి. ఫుల్లెన్త్ మాస్ యాక్షన్ ఫిల్మ్గా దీనిని తెరకెక్కించనున్నట్టు టాలీవుడ్ టాక్. అయితే, సినిమాపై బాలకృష్ణ మార్క్ ఉంటుందో, అనిల్ మార్క్ ఉంటుందో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఎదురుచూడాల్సిందే!
మెగాపవర్ స్టార్ రామ్చరణ్ భారీ సినిమాలో నటిస్తున్నాడు. భారతీయ సినిమా దిగ్గజ దర్శకుడు శంకర్, ట్రిపుల్ ఆర్తో గ్లోబల్ గుర్తింపు దక్కించుకున్న రామ్ చరణ్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతున్నది.
చరణ్కు 15వ సినిమా కావడంతో ఆర్సి 15 టైటిల్తో నెట్టింట హల్చల్ చేస్తున్నది. ఇందులో రామ్చరణ్ అవినీతి నిరోధక శాఖ అధికారిగా కనిపిస్తాడని, ద్విపాత్రాభినయం చేస్తున్నాడని.. రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా.. కొన్నాళ్లుగా తన స్థాయికి తగ్గ విజయాలు దక్కకపోవడంతో నిరాశగా ఉన్న శంకర్.. ఈ చిత్రంతో మళ్లీ సత్తా చాటాలని భావిస్తున్నాడు. ఒకవైపు కమల్హాసన్తో ‘భారతీయుడు-2’ చిత్రానికి దర్శకత్వం వహిస్తూనే, ఈ సినిమాపైనా ఫోకస్ పెట్టాడు. ఏకకాలంలో శంకర్ రెండు సినిమాలు డైరెక్ట్ చేయడం ఇదే మొదటిసారి. అన్నీ అనుకూలిస్తే ఈ సినిమా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది.
మెగాస్టార్ రెండో ఇన్నింగ్స్లో బ్రేక్ లేకుండా దూసుకుపోతున్నాడు. గతేడాది చిరంజీవి రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఇటీవల సంక్రాంతికి విడుదలైన 154వ సినిమా ‘వాల్తేరు వీరయ్య’ కాసుల వర్షం కురిపించింది. మరోవైపు 155వ సినిమా షూటింగ్ జరుపుకొంటున్నది. ‘వేదాళం’ చిత్రానికి రీమేక్గా రూపొందుతున్న ‘భోళా శంకర్’ సినిమా వేసవిలో వినోదాన్ని పంచడానికి ముస్తాబవుతున్నది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో యాక్షన్తోపాటు చిరంజీవి టైమింగ్కు తగ్గట్టుగా కామెడీ పాళ్లూ ఎక్కువే ఉన్నాయట. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ చిరంజీవికి చెల్లెలుగా నటిస్తున్నది.
మహేశ్బాబు, త్రివిక్రమ్ జట్టు కట్టారంటే అద్భుతం జరుగుతుందని అభిమానుల అంచనా! ‘అతడు’ సినిమాతో ఇది రుజువైంది. కలెక్షన్ల పరంగా ‘ఖలేజా’ కాస్త అటూఇటూ అనిపించినా మహేశ్ను మరో కోణంలో చూపించడంలో త్రివిక్రమ్ సక్సెస్ అయ్యాడు. తాజాగా వీరిద్దరి కాంబోలో మూడో సినిమా తెరకెక్కుతున్నది. ఇది మహేశ్బాబు 28వ చిత్రం. భిన్నమైన కథాంశంతో దీనిని నిర్మిస్తున్నారట. ఏప్రిల్లో విడుదల చేయనున్నట్టు సమాచారం. దీని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు మహేశ్. రాజమౌళి అండ్ కో కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఇండియానా జోన్స్ తరహా స్టోరీలైన్ ఆలోచిస్తున్నట్టు స్వయంగా రాజమౌళి ప్రకటించాడు.