అస్తిత్వం, ఆత్మాభిమానం విషయాల్లో సమంత అస్సలు రాజీపడరు. ‘విజయాన్ని సాధించాల్సింది వ్యక్తి మాత్రమే. ఆ వ్యక్తి ఆడా, మగా అనేది వ్యవస్థలో అనవసరం. అసలు ఆ ఆలోచనే అర్థరహితం’ అంటారు సమంత. ఆమె తాజా చిత్రం ‘మాఇంటి బంగారం’ రూ.100 కోట్ల వసూళ్లు దాటింది. టాలీవుడ్లో ఈ క్రెడిట్ సాధించిన తొలి మహిళాప్రధాన చిత్రమిదేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా ఈ సినిమా విడుదలకు ముందు జరిగిన ఓ సంఘటనను సామ్ తన ఇన్స్టా ద్వారా పంచుకున్నారు. “మాఇంటి బంగారం’ విడుదలకు ముందు అసలు ఈ సినిమా గురించి ఎవరైనా మాట్లాడుకుంటారా? మా ప్రయత్నం ప్రేక్షకులకు చేరుతుందా? అని ఆలోచించాం.
ఇందులో భాగంగా ఓ ఎగ్జిబిటర్కి నా స్నేహితుడు ఫోన్ చేసి ‘ ‘మాఇంటి బంగారం’ గురించి జనాల్లో ఆసక్తి ఉందా? అసలు డబ్బులు వస్తాయంటారా?’ అనడిగాడు. ‘ఆ.. హీరోయిన్ సినిమాలను ఎవరు చూస్తారండీ.. ఎవరైనా పెద్ద హీరో పక్కన నటిస్తే ఓకే. ఎందుకంటే ఆమె అందంగా ఉంటుంది.. అందరికీ తెలుసు. కానీ ఆమే అంతా అంటే ఎవరొస్తారు చెప్పండి!?’ అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడాడు ఆ ఎగ్జిబిటర్. ఆ మాటలు నేను వింటున్నట్టు అతనికి తెలీదు. నిజానికి ఈ అభిప్రాయం అతనిది మాత్రమే కాదు. చాలామందిలో ఇదే అభిప్రాయం ఉంది. మార్పు రావాలంటే తెగించి, ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి. నేను తీసుకున్నాను.. సఫలీకృతమయ్యాను. ఇది ఓ గొప్ప మార్పుకు నాంది అవుతుందని భావిస్తున్నా. ఇకనుంచి మహిళా ప్రధాన చిత్రాలను ఎవరూ తక్కువచేసి మాట్లాడకూడదు. మాట్లాడరని ఆశిస్తున్నా’ అంటూ ఆ పోస్ట్లో పేర్కొన్నారు సమంత.