Cinema News | ‘నాకు ఆత్మన్యూనతాభావం ఎక్కువ. నాగురించి నేను తక్కువగా ఊహించుకోవడం చిన్నప్పట్నుంచీ అలవాటు. అయితే నా ఆధ్యత్మిక ప్రయాణం నాలో మార్పును తీసుకొచ్చింది’ అంటున్నది బాలీవుడ్ భామ మౌనీరాయ్. టీవీ సీరియల్స్ నటిగా కెరీర్ ప్రారంభించిన మౌనీ.. అక్షయ్కుమర్ ‘గోల్డ్’ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది. ప్రస్తుతం ఇమ్రాన్ హష్మి కథానాయకుడిగా రూపొందుతోన్న ‘షో టైమ్’ సినిమాలో నటిస్తున్నారామె.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మౌని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ‘ నా గురించి నేను తక్కువగా ఊహించుకోవడం తప్పని నా ఆధ్యత్మిక ప్రయాణం నాకు ప్రభోదించింది. ఈ ప్రయాణం ద్వారా నా గొప్పతనం నాకు తెలిసింది. మనల్ని మనం ప్రేమించుకోవాలి, గౌరవించుకోవాలి. అలా చేయకపోతే సమాజం కూడా మనల్ని అంగీకరించదు. ఈ విషయం ధ్యానం ద్వారా నాకు తెలిసివచ్చింది.’ అన్నారు మౌనీరాయ్.
తనను ఈ స్థాయిలో నిలబెట్టిన టీవీని ఎప్పటికీ మరువనని, అనుకోకుండా తలపు తట్టిన అపూర్వ అవకాశం ‘గోల్డ్’ మూవీ అని, అక్షయ్కుమార్తో కలిసి నటించడం మరిచిపోలేని అనుభవమని మౌనీ ఆనందం వెలిబుచ్చింది. లెక్కలేనన్ని సినిమా ఆడిషన్స్కి అటెండ్ అయ్యానని, కానీ అవకాశాలు మాత్రం వచ్చేవి కావని, సినిమా పరిశ్రమ అంటే ఇలానే ఉంటుందని సరిపెట్టుకునేదాన్నని, ఇప్పుడు వద్దన్నా అవకాశాలు వస్తున్నాయని జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు మౌని