Mohanlal | మలయాళ చిత్ర పరిశ్రమ థ్రిల్లర్ సినిమాలకు పెట్టింది పేరనే విషయం తెలిసిందే. ఆ జానర్లో ట్రెండ్ సెట్ చేసిన చిత్రాల్లో ముందుంటుంది దృశ్యం మూవీ. సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా, దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్కు ఇప్పటికే రెండు భాగాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. దీంతో ఇప్పుడు మూడో భాగమైన దృశ్యం3పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.మొదట ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినట్టు సమాచారం. అయితే గల్ఫ్ దేశాల్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా రిలీజ్ వాయిదా పడొచ్చని వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు.
ఇప్పుడు ఆ అనుమానాలకు తెరదిస్తూ మేకర్స్ అధికారికంగా కొత్త విడుదల తేదీని ప్రకటించారు. తాజా పోస్టర్ ద్వారా ఈ సినిమాను ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ సాలిడ్ క్రైమ్ థ్రిల్లర్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు స్పష్టత వచ్చింది. ఈ చిత్రానికి సంగీతాన్ని అనీల్ జాన్సన్ అందిస్తుండగా, నిర్మాణ బాధ్యతలను ఆంటోని పెరుంబవూర్ చేపట్టారు. గత భాగాల మాదిరిగానే ఈ సినిమా కూడా ఉత్కంఠభరితమైన కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తమవుతోంది.
మొత్తానికి, ‘దృశ్యం 3’ రిలీజ్ డేట్ ఖరారవడంతో మలయాళ సినిమా అభిమానుల్లో మళ్లీ ఆసక్తి నెలకొంది. ఈసారి కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందో, మోహన్లాల్ పాత్ర ఎలా కొనసాగుతుందో చూడాలని సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సమ్మర్కి దృశ్యం3 పర్ఫెక్ట్ మూవీ. ఫ్యామిలీస్తో చూడదగ్గ థ్రిల్లర్ అని అనుకున్న మూవీ లవర్స్ .. సినిమా వాయిదా పడిందని తెలిసి కాసింత డీలా పడినా, నయా డేట్ రావడంతో ఊరట పొందుతున్నారు.