ఏపీలో సినిమా టికెట్ల రేట్లపై పవన్ కల్యాణ్కు అంత బాధ ఎందుకో అర్ధం కావడం లేదని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. తమకు పవన్ కల్యాణ్ను తొక్కేయాల్సిన ఎలాంటి అవసరం లేదని స్పష్టం చేశారు. బాధపడటానికి పవన్ కల్యాణ్ ప్రొడ్యూసరా? డిస్ట్రిబ్యూటరా? అని ప్రశ్నించారు. తన సినిమాతో తన పార్టీని నిలబెట్టుకోవాలని చూడటం కరెక్ట్ కాదన్నారు. ఈ విషయాన్ని ప్రజలతోపాటు ఆయన ఫ్యాన్స్ కూడా గమనించాలని సూచించారు.
ఆదివారం ఆమె తిరుమల స్వామివారిని దర్వించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. అల్లు అర్జున్ పుష్ప, బాలకృష్ణ అఖండ సినిమాలకు టికెట్ల రేట్లు ఎంత ఉన్నాయో.. ఇప్పుడూ అవే కొనసాగుతున్నాయని, ఇందులో ఆయనకు చేసిన అన్యాయం ఏముందన్నారు. టికెట్ల రేట్లు పెంచుకోవాలనుకునే థియేటర్ల యజమానులు జాయింట్ కలెక్టర్లకు అప్లై చేసుకోవచ్చుకదా? అని చెప్పారు. తక్కువ రేట్లకే సినిమాను చూశామని అభిమానులు ఆనందపడాలి గానీ, తొక్కేస్తున్నారంటూ వ్యాఖ్యలు చేయడం ఏంటని నిలదీశారు. మంత్రి గౌతంరెడ్డి మృతితో సమావేశం జరుగక సినిమా టికెట్ల రేట్లపై తుది నిర్ణయం తీసుకోవడం ఆలస్యమై ఉంటుందని ఆమె తెలిపారు.
మరోవైపు ఫ్లాప్ సినిమాకు చంద్రబాబు మార్కెటింగ్ చేయాలని ప్రయత్నిస్తున్నారని ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. భీమ్లా నాయక్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యిందని, ఈ వైఫల్యాన్ని తమ ప్రభుత్వంపై రుద్దేందుకే చంద్రబాబు, పవన్కల్యాణ్ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బ్లాక్ టికెట్లు అమ్ముకుని కొంతైనా బయటపడాలని చూస్తున్నారని ఆరోపించారు. అఖండ, పుష్ఫ సినిమాల టైంలో ఉన్న జీఓనే ఇప్పటికీ అమల్లో ఉన్న విషయం తెలియక మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.