ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ తరహాలో నిర్మించాలని సంకల్పం
ఒక్కో మార్కెట్ నిర్మాణానికి సుమారు రూ.4 కోట్లు
స్థలాలను గుర్తించిన అధికారులు
త్వరలో టెండర్లకు ఏర్పాట్లు
షురూ కానున్న నిర్మాణాల ప్రక్రియ
ఇంటిగ్రేటెడ్ మార్కెట్లలో సూపర్ మార్కెట్లకూ ప్రతిపాదనలు
కోల్డ్ స్టోరేజీల నిర్మాణాలతోపాటు ధరల పట్టికకు ఎల్ఈడీ స్క్రీన్లు
ఇక ఫుట్పాత్లు, మురుగు కాల్వలపై వెజ్, నాన్వెజ్ అమ్మకాలకు స్వస్తి
చిరు వ్యాపారులకు తప్పనున్న తిప్పలు
రంగారెడ్డి, మార్చి 29, (నమస్తే తెలంగాణ): ప్రజల సౌకర్యార్థం నిత్యావసరాలైన కూరగాయలు, ఆకుకూరలు, మాంసం వంటివి ఒకేచోట లభించేలా సమీకృత మార్కెట్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్-వెజ్ మార్కెట్లను అత్యాధునిక హంగులతో నిర్మించనున్నది. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మార్కెట్ తరహాలో నిర్మించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఒక్కో మార్కెట్ నిర్మాణానికి సుమారు రూ.4కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటికే అధికారులు స్థలాలను గుర్తించగా, త్వరలో టెండర్లకు ఏర్పాట్లు చేస్తున్నారు. సమీకృత మార్కెట్లో సూపర్ మార్కెట్లనూ నిర్మించనున్నారు. కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుతో పాటు ధరల వివరాలు తెలిసేలా ఎల్ఈడీ స్క్రీన్లను అందుబాటులో ఉంచనున్నారు. ఇక ఫుట్పాత్లు, మురుగు కాల్వలపై వెజ్, నాన్వెజ్ అమ్మకాలకు త్వరలో స్వస్తి పలుకనుండడంతో చిరు వ్యాపారులకు ఇబ్బందులు తప్పనున్నాయి.
ప్రతీ పట్టణంలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని ప్రజలకు మరికొన్ని వసతులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణాల్లోని ప్రభుత్వ స్థలాల్లో ప్రస్తుతం కూరగాయలు విక్రయిస్తున్నారు. ఫుట్పాత్లపై, మురుగు కాల్వలపై మటన్, చికెన్, చేపలు విక్రయిస్తున్నారు. ఈ విధానానికి స్వస్తి పలికి అన్ని వసతులు కలిగిన వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఇప్పటికే జిల్లాలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో రూ.1.10 కోట్లతో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణాన్ని చేపట్టింది. ప్రస్తుతం పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను ఏర్పాటుచేయనున్నారు. ఇందుకుగాను ఇప్పటికే స్థలాల గుర్తిం చేందుకు అధికారులు కసరత్తులు పూర్తిచేశారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను అత్యాధునిక వసతులతో ఉండేలా నిర్మించనున్నారు. సమీకృత మార్కెట్లలో కూరగాయలు, పండ్లు, పూలు, మటన్, చికెన్, చేపలను విక్రయించేందుకు ప్రత్యేకంగా దుకాణాలను నెలకొల్పనున్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో సూపర్ మార్కెట్ను కూడా పెట్టేందుకు ప్రతిపాదించారు. ఇక్కడ విక్రయించేవి తాజాగా ఉండేందుకు కోల్డ్ స్టోరేజీని సైతం నిర్మించేందకు సన్నాహాలు చేస్తున్నారు. మార్కెట్లోకి వచ్చే ప్రజలకు తాగునీటి వసతికి ఆర్వో ప్లాంట్ను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు. మార్కెట్లో ఎప్పటికప్పుడు కూరగాయల ధరల వివరాలు తెలుసుకునేందుకు చిన్నపాటి ఎల్ఈడీ స్క్రీన్లను కూడా పెట్టనున్నారు. కూరగాయలు కొనుగోలుదారులకు ధరలు తెలిసేలా ఎంట్రెన్స్లో ఎల్ఈడీ స్క్రీన్లు పెడుతారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను పూర్తిగా నిఘా నీడలోకి తీసుకొచ్చేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.
మార్కెట్లకు స్థలాల గుర్తింపు పూర్తి
జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల కోసం స్థలాల ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ మార్కెట్ నిర్మాణం తుది దశకు చేరుకుంది. మిగతా మున్సిపాలిటీల్లో త్వరలో పనులు ప్రారంభించి ఐదారు నెలల్లో నిర్మాణం పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మార్కెట్లు ప్రజలకు సమీపంలో ఉండేలా అధికారులు స్థలాలను గుర్తించారు.
వికారాబాద్ జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో మార్కెట్ల నిర్మాణం
అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో కూరగాయలు, ఆకుకూరలు, మాంసం తదితరాలు ఒకే చోట లభించేలా సమీకృత మార్కెట్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్లో నిర్మించిన సమీకృత మార్కెట్ను మోడల్గా తీసుకుని రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తి చేయాలని సంకల్పించింది. గత ప్రభుత్వాలు ఏదైనా పథకం ప్రారంభిస్తే దాన్ని పూర్తి చేయడానికి ఏండ్లు పట్టేవి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పథకం ప్రవేశపెట్టినా దానికి అవసరమైన నిధుల కేటాయింపు, యుద్ధ ప్రాతిపదికన పనులు జరిగేలా చూడడం ఆనవాయితీగా వస్తున్నది. ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో మరో కొత్త కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. పట్టణాల్లో సమీకృత వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్లకు రూపకల్పన చేసింది. ఇందుకు సంబంధించి బడ్జెట్లో ఏకంగా రూ.500 కోట్లు కేటాయించి, వాటి నిర్మాణంపై ప్రభుత్వానికి గల శ్రద్ధను బహిర్గతం చేసింది.
నాలుగు మున్సిపాలిటీల్లో మార్కెట్లు
వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో సమీకృత మార్కెట్లు నిర్మించనున్నారు. జిల్లాలో సమీకృత మార్కెట్ల నిర్మాణానికి అవసరమైన స్థలాలను అధికారులు గుర్తించారు. జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య స్వయంగా ఈ స్థలాలు పరిశీలించారు. ప్రతి మున్సిపాలిటీలో సుమారు రెండెకరాల స్థలాన్ని సమీకృత మార్కెట్ల నిర్మాణానికి కేటాయిస్తారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
ఒకే దగ్గర కూరగాయలు, నాన్ వెజ్
పట్టణాల్లో కూరగాయలు, ఆకుకూరలతోపాటు నాన్వెజ్ కూడా ఒకే దగ్గర లభించేలా సమీకృత మార్కెట్లు నిర్మించనున్నారు. వినియోగదారులు ఇబ్బంది పడకుండా ఒకే ప్రాంగణంలో కూరగాయలు, పండ్లు, మాంసం, చికెన్, చేపలు లభించేలా ఈ మార్కెట్లు నిర్మించనున్నారు. ఒక్కో మార్కెట్కు కనీసం రూ.4 కోట్లకు పైనే ఖర్చు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయా మున్సిపాలిటీల్లో కూరగాయలు ఒక దగ్గర, మాంసం, చేపలు, చికెన్ వేర్వేరు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. మార్కెట్ సదుపాయం ఉన్నా పరిగి లాంటి ప్రదేశాల్లో ఎండలోనే కూరగాయలు, మాంసం, చేపల విక్రయాలు జరుగుతున్నాయి. వేసవి, వానకాలంలో వాటిని కొనేందుకు వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులన్నింటిని దూరం చేస్తూ అన్ని ఒకే మార్కెట్లో లభించేలా ఈ మార్కెట్లు నిర్మిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా వాటి నిర్మాణాలు పూర్తి చేయాలన్నది సర్కారు సంకల్పం. పట్టణాల్లో స్థలాల గుర్తింపు సైతం జరుగడంతో సాధ్యమైనంత త్వరగా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడాదిలోపు ఎట్టి పరిస్థితుల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణాలు పూర్తిచేయాలని సర్కారు కృతనిశ్చయంతో ఉన్నది.
ఇవి కూడా చదవండి
పిల్లలకు ఆర్థిక క్రమశిక్షణ నేర్పండిలా