కేపీ చౌహాన్, ప్రీతి అస్రాని జంటగా సీనియర్ హీరోలు భానుచందర్, సుమన్ ముఖ్యపాత్రల్లో రూపొందిన చిత్రం ‘సేవాదాస్’. కేపీ చౌహాన్ దర్శకుడు. ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బంజారా, తెలుగు, ఇంగ్లీష్-హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్లో రవీంద్రభారతిలో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు హరిప్రియ బానోత్, శ్రీమతి రేఖా శ్యామ్ నాయక్, రెడ్యానాయక్, రవీంద్రనాయక్, రాథోడ్ బాబూరావు, మాజీ పార్లమెంట్ సభ్యులు అజ్మీరా సీతారాం నాయక్లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ ‘ఈ కార్యక్రమం శతదినోత్సవ వేడుకలా వుంది. ఈ చిత్రం ఖచ్చితంగా 100 రోజులాడాలి. ఆ వేడుకకు కూడా ముఖ్య అతిథిగా నన్ను పిలవాలి’ అన్నారు. బంజారా బిడ్డలు బంజారా భాషలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమా నిర్మించడం ఎంతో సంతోషంగా వుందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.