తాడేపల్లి: సినిమా టిక్కెట్ల ధరలను నిర్ణయించేందుకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ ఇంకా ప్రభుత్వానికి తన నివేదికను అందించలేదని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. సినిమా టిక్కెట్ల విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి సమస్యా లేదని, సినిమా పెద్దలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. రేపు టాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులు ఏపీ సీఎం జగన్ను కలువనున్న నేపథ్యంలో.. బుధవారం సాయంత్రం సీఎంతో మంత్రి పేర్ని నాని భేటీ అయ్యారు. రేపటి సమావేశానికి సంబంధించి పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.
సినిమా టిక్కెట్ల ధరల వ్యవహారాన్ని చర్చించడంతో పాటు వివిధ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు సినిమా పెద్దలు రేపు సీఎం జగన్తో సమావేశం కానున్నారని మంత్రి నాని తెలిపారు. ఎవరెవరు వస్తున్నారనేది ఇంకా స్పష్టత లేదని, వారి నుంచి సమాచారం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. సీఎంతో భేటీలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తారని ఆశిస్తున్నానన్నారు.
సినిమా టిక్కెట్ల ధర పెంపుదల విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి సమస్యా లేదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. వారు చెప్పేది వింటామని, గతంలో కూడా వారు ప్రభుత్వంతో మాట్లాడారని చెప్పారు. వివిధ విభాగాల పెద్దలు ప్రభుత్వంతో మాట్లాడి వ్యక్తం చేసిన అభిప్రాయాలను నమోదు చేసుకున్నామన్నారు. కమిటీ నివేదిక ఇంకా ప్రభుత్వానికి అందలేదని, ఇంతవరకు టిక్కెట్ రేట్లు ఫైనల్ అవ్వలేదని చెప్పారు. సీఎం జగన్తో చిరంజీవి ఎన్నో ముఖ్య విషయాలు చర్చించారని, చిరంజీవి అంటే జగన్కు గౌరవం ఉన్నదని, కమిటీ నివేదికలో పొందుపర్చిన అంశాలను చిరంజీవితో షేర్ చేస్తామని వెల్లడించారు. కరోనా దృష్ట్యా కొద్ది మందే సీఎంతో భేటీకి వస్తే మంచిదని ఆశిస్తున్నట్లు తెలిపారు.
కాగా, ఫిల్మ్ ఛాంబర్కు, నిర్మాతల మండలికి సంబంధం లేకుండా సీఎం వైఎస్ జగన్.. కేవలం చిరంజీవితో మాట్లాడితే సమస్య పరిష్కారం కాదని సీపీఐ జాతీయ నేత నారాయణ అన్నారు. ప్రత్యేక విమానంలో ఆగమేఘాల మీద వెళ్లి సీఎంను చిరంజీవి ఒంటరిగా కలవాల్సిన అవసరమేంటని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యలలాగే సినీ పరిశ్రమ సమస్యలను ప్రభుత్వం మేనేజ్ చేయాలని చూస్తోందని ఆరోపించారు.