Balagam movie | ‘తెలంగాణ సాకారం అయిన తర్వాత జొన్నలగడ్డ సిద్ధు, నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి వంటి హీరోలందరూ సినిమాల్లో తెలంగాణ యాసలో మాట్లాడుతుంటే మనందరి గుండెలు గర్వంతో ఉప్పొంగుతున్నాయి. మన యాస, భాష మాట్లాడటానికి మొహమాట పడ్డ రోజుల నుంచి నేడు టీవీలు మొదలుకొని వెండితెర వరకు తెలంగాణ యాస వినిపిస్తుందంటే అందుకు ఒకే ఒక్క కారణం మన ముఖ్యమంత్రి కేసీఆర్గారు’ అని అన్నారు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. మంగళవారం సిరిసిల్ల బతుకమ్మ ఘాట్లో జరిగిన ‘బలగం’ చిత్ర ప్రీరిలీజ్ వేడుకకు ఆయన ముఖ్యఅథితిగా హాజరయ్యారు. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి వేణు ఎల్దండి దర్శకత్వం వహించారు. దిల్రాజు ప్రొడక్షన్స్ శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. ఈ నెల 3న విడుదలకానుంది.
సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ ‘డబ్బు కంటే మించింది మన సంస్కృతి. అది ఈ సినిమాలో చూపించారు. కేటీఆర్గారు తెలంగాణను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నారు. రామన్న కూలెస్ట్ పొలిటీషియన్. తెలంగాణ కల్చర్ ఎంత గొప్పదో ఈ సినిమాతో అర్థమైంది. ఈ సినిమా చూస్తున్నంతసేపు సిరిసిల్లలో నిల్చున్నట్లుంది.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ‘సిరిసిల్లకు సినిమాను తెచ్చినందుకు తమ్ముడు వేణుకు కృతజ్ఞతలు. గుండె లోతుల్లో చలనాన్ని కలిగించే ఏ భావోద్వేగమైనా ప్రజా బాహుళ్యంతో తప్పకుండా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాలో మానవ సంబంధాల్ని చాలా గొప్పగా ఆవిష్కరించారు. ఇలాంటి చిన్న సినిమాలే పెద్ద సినిమాల్ని ఊపేసే ఉప్పెనలవుతాయి. ఈ సిరిసిల్ల గడ్డ మీద జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి, మిద్దె రాములు వంటి లబ్దప్రతిష్టులు జన్మించారు.నేడు తెలంగాణలో సాంస్కృతిక పునరుజ్జీవం జరుగుతున్నదంటే, ఇంతమంది అజ్ఞాత సూర్యులు తెరమీద వెలుగుతున్నారంటే తెలంగాణ ఉద్యమమే కారణం. ప్రత్యేక రాష్ట్రం లేకపోతే ఇంతమందికి అవకాశాలు దక్కేవి కావు. ప్రభుత్వ పరంగా తెలంగాణ సినిమాకు చేయాల్సింది చాలా వుంది. భవిష్యత్తులో అవన్నీ సాకారం చేస్తాం. ఇప్పుడు షూటింగ్ల కోసం పాపికొండలకు పోవాల్సిన అవసరం లేదు. మన సిరిసిల్ల రాజరాజేశ్వర సాగర్లో తిరుగుతుంటే పాపికొండల కంటే అద్భుతమైన అందాలు కనిపిస్తాయి. ఇల్లంతకుంట అన్నపూర్ణ రిజర్వాయర్కు పోతే ఐదు గుట్టల మధ్య అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. రంగనాయక్సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్..ఇవన్నీ కాళేశ్వరం ద్వారా కేసీఆర్గారు ఆవిష్కరించిన అద్భుతాలు. ఈ సినిమా తెలంగాణ పల్లెల సంస్కృతిని, తెలంగాణ కళాకారుల అద్భుతమైన ప్రతిభను వెలుగులోకి తెస్తుందని నమ్ముతున్నా. ఈ నెల 3న థియేటర్లు మొత్తం నిండిపోవాలి’ అన్నారు.
దిల్రాజు మాట్లాడుతూ ‘సిరిసిల్లతో నాకు ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. ఇప్పుడు సిరిసిల్ల అద్భుతంగా తయారైంది. హైదరాబాద్తో ఏ మాత్రం తీసిపోనివిధంగా రోడ్లు ఉన్నాయి. 2006లో కేటీఆర్గారిని ఫస్ట్టైమ్ కలిశాను. ఎప్పుడు కలిసినా ఆయన ముఖంలో అదే చిరునవ్వు కనిపిస్తుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం మామూలు విషయం కాదు. ఆ గొప్ప సంస్కారం ఆయనకు కేసీఆర్గారి నుంచి వచ్చింది. కేసీఆర్గారు తెలంగాణ రాష్ర్టాన్ని పది సంవత్సరాలుగా అభివృద్ధి పథంలో నడుపుతూ, కేటీఆర్ వంటి లీడర్ను ఈ తరానికి అందించారు. తెలంగాణ యాస, భాష అన్ని ఈ సినిమాలో ఉంటాయి. మన గుండెకాయలాంటి సినిమా ఇది’ అన్నారు.
దర్శకుడు వేణు మాట్లాడుతూ ‘ఈ వేడుకకు విచ్చేసి మా చిత్ర బృందాన్ని ఆశీర్వదించిన మంత్రి రామన్నకు జీవితాంతం రుణపడి ఉంటాను. మీ రాకతో మా బలగానికి బలం చేకూరింది. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా మారాలనే నా కలను నిజం చేసిన దిల్ రాజుగారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమా చూసి బయటకు వెళ్లాక కుటుంబ సభ్యుల సమక్షంలో ఉద్వేగం చెందుతారు. ఈ కథ మీ అందరినీ కొన్నాళ్ల పాటు వెంటాడుతుంది. ఈ రోజు సిరిసిల్లలో ఎక్కడ చూసినా పంటలతో పచ్చగా కళకళలాడుతుందంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్గారు, మంత్రి రామన్న పుణ్యమే’ అన్నారు.
ప్రియదర్శి మాట్లాడుతూ ‘ఈ సినిమాకు సపోర్ట్ చేస్తున్నందుకు కేటీఆర్ అన్నకు కృతజ్ఞతలు. తెలంగాణ పల్లె జీవితాన్ని ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. ఇలాంటి కథలు నటీనటులకు కొత్త ఉత్సాహాన్నిస్తాయి’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం, నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, సంగీత దర్శకుడు భీమ్స్తో పాటు చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.