హైదరాబాద్: ప్రముఖ నటుడు కృష్ణంరాజు మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. రెబల్ స్టార్ మృతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. అనేక సినిమాల్లో హీరోగా నటించి, తన విలక్షణ నటనాశైలితో ‘రెబల్ స్టార్’గా ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
రెబల్ స్టార్ మరణంపట్ల మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కృష్ణంరాజు మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కళామతల్లి సేవకు అంకితమైన రారాజు కృష్ణంరాజు అని సీపీఐ నారాయణ అన్నారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తంచేశారు.