మంచి స్క్రిప్ట్స్ దొరకని కారణంగానే తెలుగులో విరామం తీసుకున్నానని చెప్పింది చెన్నై చిన్నది మేఘా ఆకాష్. ఆమె శ్రీవిష్ణు సరసన కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘రాజరాజ చోర’ ఈ నెల 19న విడుదలకానుంది. హితేశ్ గోలీ దర్శకుడు. ఈ సందర్భంగా శుక్రవారం మేఘా ఆకాష్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘లాక్డౌన్ సమయంలో ఈ కథ విన్నాను. ప్రతి పాత్ర చాలా సహజంగా అనిపించింది. ఈ సినిమాలో నేను సంజన అనే పాత్రలో కనిపిస్తా. అందంతో పాటు అభినయానికి ఆస్కారమున్న పాత్రలో నటించడం ఆనందంగా ఉంది. మంచి కథలు లభించకపోవడం వల్లే తెలుగులో గ్యాప్ తీసుకున్నా. అదే సమయంలో తమిళంలో విభిన్నమైన సబ్జెక్ట్స్ రావడంతో అక్కడ సినిమాలు చేశాను. ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాల్ని అంగీకరించా. కొత్తదనంతో కూడుకున్న కథల్ని చేయాలనుంది. సినిమాల ఎంపిక విషయంలో స్వీయ నిర్ణయాల్ని తీసుకుంటా. అమ్మనాన్న నుంచి ఎలాంటి సలహాలు స్వీకరించను. ‘రాజరాజ చోర’ వినోదప్రధానంగా ఉంటూ అందరిని ఆకట్టుకుంటుంది. నేటి ప్రేక్షకులు వినోదానికి పెద్దపీట వేస్తున్నారు. అదే కోవలో అలరించే సినిమా ఇది. ప్రస్తుతం తెలుగులో ‘డియర్ మేఘ’ ‘గుర్తుందా శీతాకాలం’ ‘మనుచరిత్ర’ సినిమాలు చేస్తున్నా. మరికొన్నిన సినిమాలు చర్చల దశలో ఉన్నాయి’ అని చెప్పింది.