Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభరలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. కొల్లూరులో గుంటూరు కారం కోసం వేసిన ఇంటి సెట్లో చిరంజీవి సినిమా షూట్ జరుగుతుంది. ఇందులో త్రిష మెయిన్ హీరోయిన్గా నటిస్తుంటే.. సురభి, ఈషా చావ్లా, ఆషికా రంగనాథ్ లాంటి హీరోయిన్లు చిరంజీవి చెల్లెల్లుగా నటిస్తున్నారు. జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి సినిమాల తర్వాత చిరంజీవి నటిస్తున్న సోషల్ ఫాంటసీ మూవీ ఇదే. దీనికోసం దాదాపు 200 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు యూవీ క్రియేషన్స్. ఇప్పటివరకు మెగాస్టార్ మీద అంత బడ్జెట్ పెట్టిన నిర్మాతలు ఎవరూ లేరు.. కానీ కథ మీద నమ్మకంతో అంత భారీ బడ్జెట్ పెట్టడానికి రెడీ అయ్యారు నిర్మాతలు. ఇదిలా ఉంటే ఈ సినిమా చేస్తూనే మరొక సినిమా కూడా చేయాలని మెగాస్టార్ ఆలోచిస్తున్నాడు. దాని కోసమే కథ చెప్పే దర్శకుడి కోసం వెయిట్ చేస్తున్నాడు చిరంజీవి.
నిన్న మొన్నటి వరకు అనిల్ రావిపూడి, చిరంజీవి సినిమా కన్ఫామ్ అనుకున్నారు కానీ ఇప్పుడు వెంకటేశ్ దగ్గరికి వెళ్లిపోయాడు అనిల్. ఈ ఇద్దరి కాంబినేషన్లో సంక్రాంతికి కలుద్దాం అనే సినిమా వస్తుంది. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. 2025 సంక్రాంతి లక్ష్యంగా చేసుకొని అనిల్ రావిపూడి సినిమా రాబోతుంది. ఇప్పటికే ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 సినిమాలు బాగానే వసూలు చేశాయి. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు వెంకటేశ్, అనిల్ రావిపూడి. అనిల్ సినిమా మిస్ అయిపోవడంతో ఇంకో దర్శకుడు కోసం వెయిట్ చేస్తున్నాడు చిరంజీవి.
ఈ క్రమంలోనే ఆయన కోసం తమిళ దర్శకుడు హరి ఒక కథ సిద్ధం చేసినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే దాన్ని మెగాస్టార్ వింటాడా లేదా అనే సందేహాలు లేకపోలేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో తెలుగులో తమిళ దర్శకులకు టైం పెద్దగా కలిసి రావడం లేదు. లింగుస్వామి, మురుగదాస్, వెంకట్ ప్రభు సహా చాలా మంది దర్శకులు తెలుగులో సినిమాలు చూసి చేతులు కాల్చుకున్నారు. అందుకే ఇప్పుడు తమిళ దర్శకులతో పని చేయడానికి చిరంజీవి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇదే క్రమంలో హరీశ్ శంకర్ కూడా చిరంజీవితో సినిమా చేయాలని చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే చిరంజీవికి కథ చెప్పాలని చూస్తున్నాడు. ఒకవేళ ఈ కాంబినేషన్ వర్కౌట్ అయితే మాత్రం ఒకవైపు విశ్వంభర చేస్తూనే మరోవైపు హరీశ్ శంకర్ సినిమా కూడా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు చిరంజీవి. దర్శకుడు ఎవరైనా పర్వాలేదు కానీ ఖచ్చితంగా ఒకేసారి రెండు సినిమాలు చేయాలి అని మాత్రం మెగాస్టార్ ఆలోచన. దానికి కారణం కూడా లేకపోలేదు. విశ్వంభర సోషియో ఫాంటసీ కావడంతో అందులో విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. దాంతో చిరంజీవికి పని తక్కువగా ఉంటుంది. అందుకే ఒకేసారి రెండు సినిమాలు చేస్తే ఒక పని అయిపోతుంది అనేది మెగాస్టార్ ఆలోచన. మరి ఆయనకు కథ చెప్పే ఆ దర్శకుడు ఎక్కడ ఉన్నాడో చూడాలి.