జూబ్లీహిల్స్, మార్చి31: కరోనా వ్యాప్తితో ఇండ్లకే పరిమితమైన పదో తరగతి విద్యార్థులకు నేటి నుంచి మోడల్ పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు ఎస్ఈఆర్టీ రూపొందించిన ఈ మోడల్ ప్రాక్టీస్ పేపర్ పరీక్షలను విద్యార్థులు తొలిసారి ఇంటి నుంచే రాయనున్నారు. ఈ ఏడాది అంతంత మాత్రంగా జరిగిన తరగతులతో పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. మే 17న పబ్లిక్ పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మోడల్ ప్రాక్టీస్ పేపర్-1, మోడల్ ప్రాక్టీస్ పేపర్-2 పరీక్షలను నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకారం బుధవారం ప్రారంభం కావాల్సిన ఈ పరీక్షలు ప్రశ్నాపత్రాలు అందని కారణంగా గురువారం నుంచి మొదలవుతున్నాయి.
తొలిరోజు ఫస్ట్ లాంగ్వేజ్ విద్యార్థులకు తెలుగు, హిందీ, ఉర్దూ, రెండో రోజు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు, హిందీ , మూడో రోజు థర్డ్ లాంగ్వేజ్ ఆంగ్ల పరీక్షను నిర్వహించనున్నారు. షెడ్యూల్లో మార్పులు జరిగినప్పటికీ నాల్గవ రోజు గణితం, ఐదో రోజు జనరల్ సైన్స్(ఫిజికల్)-1, (బయాలజికల్ సైన్స్)-2, ఆరో రోజు సోషల్ స్టడీస్ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఇంటికే ప్రశ్నపత్రాలు ఇచ్చినా నిర్ధేశించిన సమయంలో సంబంధిత ఉపాధ్యాయుల పర్యవేక్షణలో జూమ్యాప్లో పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు మధ్యాహ్నం 1 గంట నుంచి 4.15 వరకు జరుగనున్నాయి. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 188 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతోపాటు అన్ని ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులు విధిగా ఈ పరీక్షలు రాయల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రస్తుతం ఇంటి నుంచి పేపర్-1 పరీక్షలు నిర్వహిస్తున్న అధికారులు ఏప్రిల్ 29 నుంచి మే 6 వరకు మోడల్ పేపర్-2 పరీక్షలను అప్పటి పరిస్థితుల మేరకు చేపట్టనున్నారు.