Raja Saab | ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న హారర్ ఎంటర్టైనర్ ‘ది రాజా సాబ్’ ప్రేక్షకులను, ముఖ్యంగా రెబల్స్ను ఖచ్చితంగా అలరిస్తుందని దర్శకుడు మారుతి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన భావోద్వేగంగా మాట్లాడుతూ, సినిమా ఒక్క శాతం కూడా నిరాశపరిస్తే నేరుగా తన ఇంటికే రావాలని అడ్రస్ కూడా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రభాస్ను ప్రేమించే ఏ ఒక్కరైనా సరే మేము డిజప్పాయింట్ చేశామనిపిస్తే, విల్లా నంబర్ 16, కొండాపూర్ ఏరియాలోని కొల్లా లగ్జోరియాకు రండి అంటూ మారుతి స్టేజ్పైనే స్పష్టంగా చెప్పారు. సినిమా మీద తనకు ఉన్న నమ్మకాన్ని ఆయన మాటలు ప్రతిబింబించాయి.
ఇక ది రాజా సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మారుతి తన స్పీచ్ మధ్యలో భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. సాధారణంగా చావులకు వెళ్లినప్పుడూ తాను ఏడవనని, కానీ గత మూడేళ్లుగా తనలో పేరుకుపోయిన స్ట్రెస్ ఇలా బయటకు వచ్చిందని చెప్పారు. మారుతి ఎమోషనల్ కావడంతో ప్రభాస్ స్వయంగా స్టేజ్పైకి వెళ్లి ఆయనను ఓదార్చారు. ఈ దృశ్యం అక్కడున్న ప్రేక్షకుల హృదయాలను తాకింది. మూడేళ్ల క్రితం ముంబైలో ‘ఆదిపురుష్’ షూటింగ్ సమయంలో ప్రభాస్ను కలిసిన సందర్భాన్ని మారుతి గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ప్రభాస్ రాముడి గెటప్లో ఉండగా, తాను ఆయన్ను బాగా నవ్వించానని, ఆ జ్ఞాపకమే తనకు ఈ భారీ సినిమా చేసే అవకాశంగా మారిందని చెప్పారు. హనుమంతునికి మరో పేరు మారుతి కావడం విశేషమని కూడా ప్రస్తావించారు.
ఈ సందర్భంగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళిని కూడా మారుతి గుర్తు చేసుకున్నారు. ఒక తెలుగు హీరోని పాన్ ఇండియా స్టార్గా మార్చిన ఘనత ఆయనదేనని, నిజంగా హ్యాట్సాఫ్ అని ప్రశంసించారు. “నేను నా స్థాయిలో సినిమాలు చేస్తూ వచ్చాను. 11 సినిమాలు చేసిన నన్ను రెబల్ యూనివర్సిటీకి తీసుకెళ్లారు ప్రభాస్. హారర్ జానర్ను నెక్స్ట్ లెవల్కు తీసుకెళ్లారు. కొన్ని సీన్లు చూస్తే నాకు కన్నీళ్లు వచ్చాయి. అలాంటి నటన ఇచ్చిన ప్రభాస్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించిన టీజీ విశ్వప్రసాద్ గారికీ థ్యాంక్స్” అని మారుతి తెలిపారు. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించిన ‘ది రాజా సాబ్’ సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలో విడుదల కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, ఆయన కుమార్తె కృతి ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.