కథలోని భావోద్వేగాలు, దర్శకుడి సృజనాత్మకతతో స్వరకర్త సహానుభూతి చెందినప్పుడే అద్భుతమైన సంగీతం పుడుతుందని చెప్పారు యువ సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్. ‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చేతన్ భరద్వాజ్ స్వరాల్ని అందిస్తున్న తాజా చిత్రం ‘మహాసముద్రం’. శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రధారులు. అజయ్భూపతి దర్శకుడు. ఈ నెల 14న విడుదలకానుంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ మాట్లాడుతూ “మహాసముద్రం’లో హృదయాన్ని కదిలించే తీవ్రమైన భావోద్వేగాలుంటాయి. విధి ఎంత బలీయమైనదో, అమాయకుల జీవితాల్ని ఏ విధంగా మలుపుతిప్పగలదో అనే అంశాల్ని హృద్యంగా ఆవిష్కరించారు. ఇలాంటి కథకు మ్యూజిక్ అందించడం ఓ సవాలుగా అనిపించింది. పాటలన్నీ శ్రోతలకు బాగా కనెక్ట్ అయ్యాయి. ‘చెప్పకే చెప్పకే..’ అనే పాట బాగా నచ్చింది. సంగీతం సినిమా కథను మరింత ఉన్నతీకరించాలి. ప్రేక్షకుల దగ్గరకు సినిమాను తీసుకెళ్లాలన్నదే నా ఫిలాసఫీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం కన్నా బాణీలు కట్టడానికే ఎక్కువగా ఇష్టపడతా. ఆనంద్ దేవరకొండ సినిమా ఒకటి చర్చల్లో ఉంది’ అని చెప్పారు.