‘ఇదొక డార్క్ థ్రిల్లర్. గ్రామీణ నేపథ్యంలో కథ సాగుతుంది. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని పాయింట్తో తెరకెక్కించాం’ అన్నారు అజయ్ భూపతి. ఆయన దర్శకత్వంలో పాయల్ రాజ్పుత్, అజ్మల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మంగళవారం’. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ ఎం నిర్మిస్తున్నారు. నవంబర్ 17న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానుంది.
శనివారం ఈ సినిమా ట్రైలర్ను అగ్ర నటుడు చిరంజీవి ఎక్స్ (ట్విట్టర్) ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ ‘ఇలాంటి డార్క్ థ్రిల్లర్ చిత్రాన్ని గ్రామీణ నేపథ్యంలో తీయడం చాలా కష్టం. రా అండ్ రస్టిక్ మూవీ ఇది. ‘మంగళవారం’ టైటిల్ వెనక ఓ కారణం ఉంది. అది సినిమా చూస్తేనే అర్థమవుతుంది. దేవతలకు ఇష్టమైన రోజు మంగళవారం. దానిని జయవారం అని కూడా పిలుస్తారు. టైటిల్ గురించి బయట అనుకునే మాటలను పట్టించుకోవద్దు’ అన్నారు.
తాను ‘మా’ టీవీలో పనిచేశానని, నిర్మాత కావాలనే డ్రీమ్ ఈ సినిమాతో నెరవేరడం ఆనందంగా ఉందని నిర్మాత స్వాతి రెడ్డి పేర్కొంది. పాయల్ రాజ్పుత్ మాట్లాడుతూ ‘కెరీర్ ఎటు వెళ్తుందో అనే అనిశ్చితిలో ఉన్నప్పుడు ఈ సినిమా ఛాన్స్ వచ్చింది. తప్పకుండా నాకు మంచి పేరుతీసుకొస్తుందనే నమ్మకం ఉంది’ అని చెప్పింది.
దర్శకుడు అజయ్ భూపతి ఈ కథ చెప్పగానే..స్క్రీన్ మీద చూడాలని తపించానని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుందని నిర్మాత సురేష్ వర్మ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: అజనీష్ లోక్నాథ్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: అజయ్ భూపతి.