ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు తన ప్రత్యర్థి ప్రకాష్రాజ్పై 107 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా బాబుమోహన్పై శ్రీకాంత్, జనరల్ సెక్రటరీగా జీవితపై రఘుబాబు విజయాన్ని అందుకున్నారు. ట్రెజరర్గా శివబాలాజీ గెలుపొందారు. జాయింట్ సెక్రటరీలుగా ఉత్తేజ్, గౌతమ్రాజు గెలుపొందారు. వైస్ ప్రెసిడెంట్తో పాటు ఈసీ కమిటీ విజేతలను నేడు అధికారికంగా ప్రకటించనున్నారు.
ఆదివార జరిగిన ‘మా’ (మూవీ ఆర్టిస్టు అసోసియేషన్) సాధారణ ఎలక్షన్స్ను తలపిస్తూ నాటకీయ ఘటనల నడుమ ముగిశాయి. 883 మంది సభ్యులకుగాను రికార్డుస్థాయిలో 673 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మా ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధిక పోలింగ్ కావడం గమనార్హం.
ఉదయం ఎనిమిది గంటల నుంచి మొదలైన ఎన్నికల కోలాహలం మధ్యాహ్న సమయానికి పతాకస్థాయికి చేరింది. సినీ తారల రాకతో పోలింగ్కు వేదికైన జూబ్లీహిల్స్ పబ్లిక్స్కూల్ పరిసర ప్రాంతాలు కోలాహలంగా కనిపించాయి. గతంలో లేని విధంగా పోలీసులు భారీ బందోబస్తును నిర్వహించారు. తారల్ని చూసేందుకు, వారితో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు.
మేమంతా ఒకటే..
పోలింగ్కు ముందు పరస్పర దూషణలతో ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించిన అధ్యక్ష అభ్యర్థులు ప్రకాష్రాజ్, విష్ణు పోలింగ్ కేంద్రం వద్ద ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఎన్నికల వరకే ప్రత్యర్థులమని..ఆ తర్వాత తామంతా ఒకటేనని ప్రకాష్రాజ్, మంచు విష్ణు పేర్కొన్నారు. పోలింగ్ మొదలైన తొలి గంటలోనే అగ్రనటులు చిరంజీవి, బాలకృష్ణ, పవన్కల్యాణ్, మోహన్బాబు, రామ్చరణ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కనిపించని అగ్రతారల జాడ
‘మా’ ఎన్నికల్లో పలువురు సీనియర్, యువ నటులు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెన్నై, ముంబయి, బెంగళూరులో నివసిస్తున్న పలువురు తెలుగు నటీనటులు ఓటు వేసేందుకు నగరానికి వచ్చారు. అగ్రహీరోలు, నాయికలు మాత్రం పోలింగ్కు దూరంగా ఉన్నారు. వెంకటేష్, మహేష్బాబు, ప్రభాస్, రానా, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రకుల్ప్రీత్సింగ్తో పాటు పలువురు హీరోహీరోయిన్లు ఈ ఎన్నికల్లో ఓటు వేయలేదు.
ఈ సారి పోలింగ్ సమయాన్ని గంట పెంచారు. ఓటు వేయాల్సిన సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో మూడు గంటల వరకు ఓటింగ్ను కొనసాగించారు.
శివబాలాజీ చేయి కొరికిన హేమ
శివబాలాజీ చేయిని హేమ కొరకడంతో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తాను నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో శివబాలాజీ చేయి అడ్డం పెట్టాడని, తప్పుకోమన్నా స్పందించకపోవడంతోనే తాను చేయి కొరకాల్సి వచ్చిందని హేమ వివరణ ఇచ్చింది. శివబాలాజీ చేతికి గాయం కావడంతో నిమ్స్లో చేరి చికిత్స తీసుకున్నారు. విష్ణు విజయం అనంతరం మోహన్బాబు మీడియాతో మాట్లాడారు. గతాన్ని మర్చిపోయి అందరం ఒకే తల్లి బిడ్డల్లా కలిసి ఉందామని, మాటల యుద్ధానికి ఫుల్స్టాప్ పెడదామని కోరారు.
నాగబాబు రాజీనామా
ప్రాంతీయవాదం, సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న ‘మా’ అసోసియేషన్లో కొనసాగడం ఇష్టం లేక తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఎన్నికల అనంతరం నాగబాబు ప్రకటించారు. సినీ పరిశ్రమలో హీరోల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటే వివాదాలు, గొడవలకు తావు ఉండదన్నారు అగ్రనటుడు చిరంజీవి. ‘పెళ్లి సందడి’ ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన మాట్లాడుతూ ‘ పదవులు తాత్కాలికం. వాటి కోసం మాటలు అనడం, అనిపించుకోవడం చూస్తుంటే బయటివాళ్లకు మనం లోకువ అయిన భావన కలుగుతున్నది. పదవుల కోసం అంతగా దిగజారాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలు బాధను కలిగిస్తున్నాయి. ఎవరిని నేను వేలెత్తి చూపించడం లేదు. మన ఆధిపత్యాన్ని చూపించడం కోసం ఎదుటివారిని కించపరచాల్సిన అవసరం లేదు.’ అని పేర్కొన్నారు.