Manchu Vishnu | తమిళనాడు రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరో విజయ్ సొంత రాజకీయ పార్టీ ప్రారంభించిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితంపై వస్తున్న విమర్శలు కలకలం రేపుతున్నాయి. విజయ్ భార్యతో విడాకుల వ్యవహారం, అలాగే ప్రముఖ నటి త్రిషతో ఆయనకు సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రచారాలపై ఇప్పటికే సీనియర్ నటి ఖుష్బూ సుందర్ స్పందించారు. త్రిష ఎంతో గౌరవనీయమైన నటి అని, ఆమెపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం సరికాదని పేర్కొంటూ ఆమెకు మద్దతుగా నిలిచారు.
ఈ వివాదాల నేపథ్యంలో నటుడు మంచు విష్ణు కూడా సోషల్ మీడియా ద్వారా స్పందించారు. రాజకీయ కథనాల్లోకి నటీమణులను లాగడం అత్యంత అసభ్యకరమైన చర్య అని ఆయన తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం తమిళనాడులోనే కాకుండా ఎక్కడైనా రాజకీయ లబ్ధి కోసం సినీ తారల వ్యక్తిగత జీవితాలను ఉపయోగించడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు. నటీనటులు కేవలం తెరపై కనిపించే పాత్రలే కాకుండా వారికి కూడా భావోద్వేగాలు, గౌరవం ఉంటాయని మంచు విష్ణు పేర్కొన్నారు. వారి జీవితాల్లో కూడా ఒక ప్రైవేట్ స్పేస్ ఉంటుందని, దానిని గౌరవించాల్సిన బాధ్యత సమాజంపై ఉందని చెప్పారు. అలాగే నటీనటులకు కుటుంబాలు ఉంటాయని, సమాజంలో వారికి ఒక హోదా ఉంటుందని ఆయన గుర్తు చేశారు.
రాజకీయ ప్రయోజనాల కోసం వారి ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించడం నాగరిక సమాజానికి తగినది కాదని వ్యాఖ్యానించారు. ప్రజా చర్చలు లేదా రాజకీయ విమర్శలు అనేవి ప్రాథమిక గౌరవాన్ని దెబ్బతీసేలా ఉండకూడదని విష్ణు సూచించారు. ముఖ్యంగా మహిళల విషయంలో మరింత సంయమనం పాటించాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినా అవి మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉండకూడదని, వార్తల కోసం వారిని బలిపశువులుగా మార్చడం తగదని హితవు పలికారు. భారతీయ సంస్కృతిలో మహిళలకు ఎప్పుడూ గౌరవప్రదమైన స్థానం ఉంటుందని గుర్తు చేసిన మంచు విష్ణు, అలాంటి దేశంలో రాజకీయాల కోసం మహిళలను అవమానాలకు గురిచేయడం దురదృష్టకరమని అన్నారు. “మనం మరింత మెరుగ్గా ప్రవర్తిద్దాం” అంటూ సమాజానికి, రాజకీయ వర్గాలకు ఆయన పిలుపునిచ్చారు.