‘నేను సూపర్మ్యాన్ని కాదు. అందరికీ అన్నివేళలా అందుబాటులో ఉండను. అందుకే ‘ఐక్య ధైర్య సేనా సమితి’ అనే సేవా సంస్థను స్థాపించాను. ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలం. పైగా నా కొడుకు పేరు ధైరవ్, బిడ్డ పేరు దేవసేన. వీరిద్దరి పేర్లు కలిసి వచ్చేలా ఈ సంస్థకు ఆ పేరు పెట్టాం. ఇది వాయిస్లెస్కి వాయిస్గా ఉంటుంది’ అని హీరో మంచు మనోజ్ అన్నారు.
బుధవారం(నేడు) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా హైదరాబాద్లో విలేకరులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు మంచు మనోజ్. ఇంకా మాట్లాడుతూ ‘జూన్ 7న నా కొత్త సినిమా ‘రక్షక్’ షూటింగ్ మొదలుకానున్నది. మహిళా సాధికారత, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో ఆ సినిమా ఉంటుంది. అందులో నేను డీసీపీగా నటిస్తున్నా.
ఆ మూవీ ఓపెనింగ్ రోజున మా ‘ఐక్య ధైర్య సేనా సమితి’ విధివిధానాలను ప్రకటిస్తా’ అని తెలిపారు మంచు మనోజ్. తనకు నటుడిగా పునర్జన్మనిచ్చిన ‘మిరాయ్’ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని, ‘భైరవం’ దర్శకుడు విజయ్ కనకమేడలకు మంచు మనోజ్ కృతజ్ఞతలు తెలిపారు. రకరకాల పాత్రల్ని చేయాలనుకుంటున్నానని, నచ్చిన కథల్ని మాత్రమే చేస్తానని మంచు మనోజ్ చెప్పారు.
‘పరస్పరం ఒకరినొకరం గౌరవించుకుంటూ నా భార్య, నేనూ జీవితాలను సాగిస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో నా భార్య భూమా నాగమౌనిక పోటీ చేస్తుంది’ అని తెలిపారు మనోజ్. తాను నటిస్తున్న ‘డేవిడ్ రెడ్డి’ షూటింగ్ 40శాతం పూర్తయిందని, ఇవిగాక ఐదారు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని మంచు మనోజ్ తెలిపారు.