Mamta Mohandas | హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రజతోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆస్పత్రి ఛైర్మన్, నటసింహం నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దర్శకులు కొరటాల శివ, అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని, బాబీ కొల్లి పాల్గొనగా.. క్యాన్సర్ను జయించిన నటి గౌతమి, మమతా మోహన్ దాస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమంలో మాట్లాడిన మమతా మోహన్ దాస్ తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన దశలను గుర్తు చేసుకున్నారు. క్యాన్సర్తో పోరాడిన అనుభవాలను పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకోవడం అక్కడున్న వారిని కదిలించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చాలామంది అనుకుంటున్నట్లుగా తనకు బ్రెస్ట్ క్యాన్సర్ రాలేదని మమతా వెల్లడించారు. తనకు రిఫ్రాక్టరీ హాడ్జ్కిన్స్ లింఫోమా అనే అరుదైన రక్త క్యాన్సర్ సోకిందని చెప్పారు. చికిత్సలో భాగంగా కీమోథెరపీతో పాటు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కూడా చేయించుకోవాల్సి వచ్చిందన్నారు. సాధారణ చికిత్సలు ఫలించని సమయంలో 2014లో అమెరికాలో నిర్వహించిన ‘ఒప్డివో’ ఔషధ క్లినికల్ ట్రయల్ తన ప్రాణాలను కాపాడిందని ఆమె గుర్తు చేసుకున్నారు. క్యాన్సర్తో పోరాడిన తర్వాత జీవితాన్ని చూసే తన దృక్పథం పూర్తిగా మారిపోయిందని మమతా చెప్పారు. ప్రస్తుతం తాను పూర్తిగా కోలుకోవడం గురించి కాకుండా, ప్రతి రోజును ధైర్యంగా జీవించడం, మానసికంగా బలంగా ఉండడం, జీవితాన్ని ఆస్వాదించడంపైనే దృష్టి పెట్టానన్నారు.
అమెరికాలో క్యాన్సర్ రోగుల మానసిక పరిస్థితిని అంచనా వేసే ‘క్వాలిటీ ఆఫ్ లైఫ్ అసెస్మెంట్స్’ వంటి విధానాలు అమలులో ఉన్నాయని, అలాంటి వ్యవస్థ భారత వైద్య రంగంలో కూడా అవసరమని అభిప్రాయపడ్డారు. క్యాన్సర్ రోగుల పట్ల జాలి చూపడం కంటే వారి పరిస్థితిని అర్థం చేసుకుని అండగా నిలవడం ఎంతో ముఖ్యమని మమతా పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు ఎప్పుడూ ఆందోళనగా కనిపిస్తే రోగుల్లో భయం మరింత పెరుగుతుందని, ఇంటి నుంచి సానుకూల వాతావరణం, ధైర్యం అందడం ఎంతో అవసరమన్నారు.క్యాన్సర్ను జయించిన వారు బలహీనులు కాదు. ఆ పోరాటం వారిని మరింత దృఢంగా మారుస్తుంది. ప్రేమ, మద్దతు ఉంటే ప్రతి రోగి ధైర్యంగా పోరాడగలడు అని ఆమె అన్నారు. కాగా, మమతా 2009లో తొలిసారి క్యాన్సర్ బారిన పడిన అనంతరం చికిత్స తీసుకుని కోలుకున్నారు. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. అయితే 2013లో మరోసారి వ్యాధి తిరగబెట్టడంతో మరోసారి చికిత్స తీసుకుని ధైర్యంగా పోరాడి విజయం సాధించారు.