‘ ఓ పెద్దాయన జీవితంలోని సంఘటనల సమాహారం ఈ సినిమా. అనుకోకుండా అతని జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు వస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది ఈ సినిమా కథ. ఆ ముగ్గురూ నేనే’ అని సుధీర్బాబు చెప్పారు. రచయిత హర్షవర్దన్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’. సునీల్ నారంగ్, పున్కూర్ రామ్మోహన్రావు నిర్మాతలు. అక్టోబర్ 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా సుధీర్బాబు విలేకరులతో ముచ్చటించారు.
‘కంటెంట్ ఉన్న కమర్షియల్ సినిమా ఇది. ఓ విధంగా నటుడిగా నాకిది సాహసమే. పొంతన లేని మూడు రకాల పాత్రలు ఇందులో చేశాను. ఈ పాత్రలు చేయడానికి శారీరకంగా, మానసికంగా చాలా కష్టపడ్డాను. ఒక పాత్రలో వృద్ధుడిగా కనిపిస్తా. ఒక పాత్రలో లావుగా కనిపిస్తా. మూడో పాత్రలో నాలా నేనుంటా. వీటి మేకప్ కోసం ప్రోస్తటిక్ వాడాం. చాలా శ్రద్ధ తీసుకున్నాం. ఎబ్బెట్టుగా ఉండకుండా జాగ్రత్తపడ్డాం. లావుగా ఉండే పాత్ర మేకప్ విషయంలో కాస్త ఇబ్బంది పడాల్సివచ్చింది’ అని చెప్పారు సుధీర్బాబు. ఇంకా చెబుతూ ‘దర్శకుడు హర్షవర్దన్ ఈ కథ చెప్పినప్పుడు ఆశ్చర్యానికి లోనయ్యాను. ఊహలకు అందని రీతిలో ఉంటుందీ సినిమా.
నా పాత్రల విషయంలో చాలా రీసెర్చ్ చేశాను. కథానాయికలు ఇషా రెబ్బా, మృణాళిని పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి’ అన్నారు. ‘ కృష్ణగారి బయోపిక్లో నటిస్తారా? అనడిగితే -‘అవకాశం వస్తే తప్పకుండా చేస్తా. చేయలగను కూడా. అల్లుడిగా చెప్పట్లేదు. అభిమానిగా చెపుతున్నా’ అని మనసులోమాట బయటపెట్టారు సుధీర్బాబు.