Manchu Vishnu | తెలుగు సినిమా 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘నవతిహి ఉత్సవం’ పేరుతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) మలేషియాలో ఉత్సవాన్ని నిర్వహించబోతున్నది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు మాట్లాడుతూ ‘జూలైలో ఈ ఉత్సవాన్ని మలేషియాలో వైభవంగా నిర్వహించబోతున్నాం. రెండేళ్ల క్రితమే ఈ ఉత్సవాన్ని నిర్వహించాలని ప్లాన్ చేశాం. అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.
ప్రస్తుతం తెలుగు సినిమా ప్రభ వెలిగిపోతున్నది. తెలుగు సినిమా ఘనకీర్తిని తెలిపేలా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాం. ఈ వేడుక నిర్వహణకు మలేషియా ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ ఈవెంట్ గురించి ఛాంబర్తో చర్చించాం. మూడు రోజులు ఇండస్ట్రీకి సెలవు ఇవ్వాలని కోరాం. దిల్రాజు, దాముగారు సపోర్ట్ చేస్తామని చెప్పారు. త్వరలోనే ఈ వేడుక నిర్వహించే తేదీలను ప్రకటిస్తాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో మలేషియా నుంచి వచ్చిన అడ్వైజర్ ధాతుక్ కమలనాథన్, మలేషియా టూరిజం ఇండియా, శ్రీలంక ప్రతినిధి రాజౌది అబ్దుల్ రాహిమ్ పాల్గొన్నారు.