అడివి శేష్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. శోభితా ధూళిపాళ, సయీ మంజ్రేకర్ నాయికలుగా నటిస్తున్నారు. ముంబై ఉగ్రదాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నది. జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ఫ్లస్ ఎస్ మూవీస్తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
శేష్ కథ స్క్రీన్ప్లే అందించిన ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. జూన్ 3న విడుదల కానున్న ఈ సినిమా ముందస్తు ప్రదర్శనలకు సిద్ధమవుతున్నది. దేశవ్యాప్తంగా ఢిల్లీ, అహ్మదాబాద్, పుణె, బెంగళూరు, కొచ్చిన్, హైదరాబాద్ వంటి ఎంపిక చేసిన నగరాల్లో బుక్ మై షో ద్వారా ఈ ప్రివ్యూ షోస్ వేయబోతున్నారు. సోమవారం ఈ విషయాన్ని చిత్రబృందం ప్రకటించారు. ముంబై ఉగ్రదాడి అమరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ దేశం కోసం చేసిన నిరుపమాన త్యాగాన్ని, సాహసాన్ని సినిమాలో చూపించబోతున్నారు.