Major Pre-Release Event | ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన నటన, అభినయంతో ప్రేక్షకులలో విపరీతమైన అభిమానాన్ని ఏర్పరచుకున్న నటుడు అడివి శేష్. టాలీవుడ్లో థ్రిల్లర్ కథలకు కెరాఫ్ అడ్రెస్గా శేష్ నిలిచాడు. లేటెస్ట్గా ఈయన నటించిన చిత్రం ‘మేజర్’. ముంబై బాంబు దాడుల్లో అమరవీరుడైన మేజర్ సందీప్ ఉన్నీ కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ‘గూఢచారి’ ఫేం శశికిరణ్ టిక్కా దర్శకత్వం వహించాడు. ఇదివరకే చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ గ్లింప్స్, ట్రైలర్ ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలు నమోదు చేశాయి. యాక్షన్ థిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ఎప్పటికప్పుడు అప్డేట్లను ప్రకటిస్తుంది. తాజాగా మేకర్స్ మరో అప్డేట్ను ప్రకటించారు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 29న వైజాగ్లో జరుగనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇటీవలే వైజాగ్ ఫ్యాన్స్ స్పెషల్ స్క్రీనింగ్ ఇక్కడ ఎందుకు లేదు అని కామెంట్స్ చేయగా, దానికి శేష్ వైజాగ్ ప్రేక్షకులకు ఓ స్పెషల్ సర్ప్రైజ్ ఉంటుందని చెప్పాడు. ఇక ఇప్పుడు మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను వైజాగ్లో జరుపుతుండటంతో వైజాగ్ అభిమానులు ఖుషి అవుతున్నారు. ఈ చిత్రాన్ని జీఎంబీ ఎంటర్టైనమెంట్స్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏ+ఎయస్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అడివిశేష్కు జోడీగా సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. శోభితా ధూళిపాల కీలకపాత్రలో నటించింది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.