Main Vaapas Aaunga | ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్ అలీ, విలక్షణ నటుడు దిల్జీత్ దోసాంజ్ కాంబినేషన్లో రాబోతున్న తాజా చిత్రం ‘మేన్ వాపస్ ఆవుంగా’ (Main Vaapas Aaunga). ఆమర్ సింగ్ చమ్కీలా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను జూన్ 12న విడుదల చేయబోతుండగా తాజాగా టీజర్ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ టీజర్ చూస్తుంటే.. 1947 భారతదేశ విభజన నేపథ్యంలో సాగే ఒక ఉద్వేగభరితమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని ఇంతియాజ్ అలీ వెండితెరపై ఆవిష్కరిస్తున్నట్లు తెలుస్తుంది. దాదాపు 78 ఏళ్లుగా తన గుండెల్లో దాచుకున్న ప్రేమ జ్ఞాపకాలను నసీరుద్దీన్ షా తన మనవడికి (దిల్జీత్ దోసాంజ్) వివరిస్తుండగా, దిల్జీత్ నెరేటర్గా ఆ అద్భుత గాథను నేటి తరానికి పరిచయం చేయడం టీజర్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రంలో నసీరుద్దీన్ షా యువకుడి పాత్రలో వేదాంగ్ రైనా నటిస్తుండగా, అతనికి జోడీగా శార్వరీ వాఘ్ అలరించనుంది.
చమ్కీలా తర్వాత ఇంతియాజ్ అలీ, ఏఆర్ రెహమాన్ మరియు ఇర్షాద్ కామిల్ వంటి దిగ్గజాల మ్యూజికల్ కాంబో మళ్లీ పునరావృతం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్ ముగింపులో వేదాంగ్ రైనా రైలుపై వెళ్తూ “మేన్ వాపస్ ఆవుంగా” అని అరిచే సన్నివేశం ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పిస్తుండగా, దిల్జీత్ తనదైన శైలిలో సోషల్ మీడియా ట్రెండ్ను ఉద్దేశించి చెప్పిన డైలాగ్ కాస్త వినోదాన్ని పంచుతోంది.