Rajamouli and Mahesh Film | ట్రిపుల్ ఆర్ ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు సినిమా టీమ్. ఇటీవల దుబాయ్ వెళ్లిన ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి…అక్కడి నుంచి నేరుగా బెంగళూరులో ల్యాండ్ అయ్యారు. చిక్ మంగళూరులో గ్రాండ్ ప్రీ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొని గుజరాత్ చేరుకున్నారు. ఇవాళ గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర సందడి చేశారు. ఇక్కడి నుంచి ఢిల్లీ, అమృత్ సర్, జైపూర్, కోల్కతా, వారణాసి చుట్టేసి చివరగా హైదరాబాద్లో ఈవెంట్ జరపనున్నారు. ఇదిలా ఉంటే ఈ టూర్లో భాగంగా హీరోలతో పాటు దర్శకుడు రాజమౌళి కూడా మీడియాతో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన తదుపరి చిత్రంపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇస్తున్నారు.
ట్రిపుల్ ఆర్ తర్వాత తాను చేయబోయే సినిమా మహేశ్ బాబుతో ఉంటుందని.. అయితే బయట ప్రచారం జరుగుతున్నట్లు అది మల్టీస్టారర్ కాదని రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. ఇందులో మరో హీరో ఉండరని మహేశ్ సోలో హీరోగా ఈ చిత్రాన్ని రూపొందిస్తానని స్పష్టం చేశాడు. మహేశ్, రాజమౌళి సినిమాలో బాలకృష్ణ కీలకపాత్రలో నటిస్తారని కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు జక్కన్న చెప్పిన మాటలతో.. ఈ పుకార్లకు తెరపడింది. కాగా.. మహేశ్ బాబుతో తీసే సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగుతుందని రచయిత విజయేంద్ర ప్రసాద్ గతంలో తెలిపారు. తెలుగు తెరకు ఇలాంటి సినిమా కొత్త తరహాది అవుతుందని పేర్కొన్నారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కే ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివరలో ప్రకటించే అవకాశం ఉంది.