Mahesh Babu | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా ప్రశాంతంగా కనిపిస్తూ, తనదైన హాస్యంతో అందరినీ ఆకట్టుకుంటుంటారు. సెట్స్లోనే కాదు, కుటుంబ సభ్యులతో కూడా సరదాగా ఉండే మహేష్ గురించి తాజాగా ఆయన మరదలు, నటి శిల్పా శిరోద్కర్ చెప్పిన ఓ ఆసక్తికర సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇటీవల ఓ డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొన్న శిల్పా శిరోద్కర్.. మహేష్ బాబు తమతో చాలా సంవత్సరాలు ఓ చిన్న సీక్రెట్ దాచిపెట్టి ఎలా ఆటపట్టించారో గుర్తు చేసుకున్నారు. శిల్పా శిరోద్కర్ మాట్లాడుతూ.. మహేష్ బాబు, నమ్రత పెళ్లైన కొత్తలో ఆయనకు మరాఠీ భాష రాదని తాము భావించామని చెప్పారు. అందుకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు లేదా రహస్యాలు మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు మహేష్ ముందే మరాఠీలో మాట్లాడుకునేవాళ్లమని తెలిపారు.
మహేష్కు మరాఠీ అర్థం కాదని అనుకుని.. నేను, నమ్రత ఆయన ఎదుటే మరాఠీలో ఎన్నో వ్యక్తిగత విషయాలు మాట్లాడుకునేవాళ్లం. ఆయన మాత్రం ప్రశాంతంగా వింటూ ఉండేవారు. మాకు మాత్రం ఆయనకు ఒక్క మాట కూడా అర్థం కావడం లేదనిపించేది అని శిల్పా తెలిపారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక రోజు తాము మరాఠీలో మాట్లాడుకుంటుండగా.. మహేష్ బాబు ఒక్కసారిగా అదే భాషలో స్పందించారని శిల్పా గుర్తు చేసుకున్నారు. మేము మాట్లాడుకుంటుండగా మహేష్ ఒక్కసారిగా మరాఠీలో ‘అవునా.. నిజమా?’ అని అన్నారు. అది విని మేమిద్దరం షాక్ అయ్యాం. అప్పుడే ఆయనకు మరాఠీ బాగా అర్థమవుతుందని తెలిసింది. ఇన్నేళ్లుగా మా మాటలన్నీ వింటూ కూడా ఏమీ తెలియనట్టు నటించాడని అర్థమైంది అంటూ నవ్వుతూ చెప్పారు.
ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ శిల్పా సరదాగా మాట్లాడుతూ.. అదృష్టవశాత్తూ మేము మహేష్ గురించి ఎలాంటి నెగెటివ్ విషయాలు మాట్లాడుకోలేదు. ఒకవేళ అలా చేసి ఉంటే.. ఆ తర్వాత ఆయన మమ్మల్ని ఇంకా ఎక్కువగా ఆటపట్టించేవారు అంటూ నవ్వులు పూయించారు. శిల్పా శిరోద్కర్ చెప్పిన ఈ సరదా సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేష్ బాబు సెన్స్ ఆఫ్ హ్యూమర్, కుటుంబ సభ్యులతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని ఈ సంఘటన మరోసారి చూపించిందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. సైలెంట్గా ఉండి అందరి సీక్రెట్స్ తెలుసుకున్న మహేష్ స్టైల్ సూపర్ అంటూ నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు.