మహేష్బాబు కథానాయకుడిగా అగ్ర దర్శకుడు రాజమౌళి ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. జంగిల్ అడ్వెంచర్ నేపథ్యంలో హాలీవుడ్ స్థాయి ప్రమాణాలతో ఈ సినిమాకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ కథను సమకూర్చుతున్నారు. తాజాగా ఆయన ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ను వెల్లడించారు. ఆఫ్రికా నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇదని, ఈ సినిమాలో కొందరు హాలీవుడ్ నటులు కూడా భాగం కాబోతున్నారని విజయేంద్రప్రసాద్ తెలిపారు.
గ్లోబల్ ఆడియెన్స్కు రీచ్ అయ్యే కథాంశమిదని దర్శకుడు రాజమౌళి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన హాలీవుడ్ నటులను కూడా తీసుకోబోతున్నారని సమాచారం. ఈ చిత్రంలో మహేష్బాబు పాత్రను హనుమంతుడిని స్ఫూర్తిగా తీర్చిదిద్దుతున్నారని, హనుమాన్ లక్షణాలు మూర్తీభవించిన కథానాయకుడిగా ఆయన పాత్ర చిత్రణ ప్రత్యేకంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ సంవత్సరాంతంలో ఈ చిత్రం సెట్స్మీదకు వెళ్లనుందని తెలిసింది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్బాబు ‘గుంటూరు కారం’ చిత్రంలో నటిస్తున్నారు.