Mahesh Babu | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’తో బిజీగా ఉన్నారు. గ్లోబల్ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు తాజాగా విదేశాలకు వెళ్లడం చర్చనీయాంశంగా మారగా, ఆయన తాజా పోస్టుతో అసలు విషయంపై క్లారిటీ వచ్చింది. ఇటీవల షూటింగ్కు చిన్న బ్రేక్ ఇచ్చిన మహేష్ బాబు ఎక్కడికి వెళ్లారన్నది ఆసక్తికరంగా మారింది. సినిమా తదుపరి షెడ్యూల్ కోసం ముందస్తు ఏర్పాట్లలో భాగంగా వెళ్లి ఉంటారని భావించినప్పటికీ, ఆయన స్వయంగా తన లొకేషన్ను సోషల్ మీడియాలో వెల్లడించారు. ప్రస్తుతం జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ ప్రాంతంలో ఉన్నట్లు తెలిపారు.
అక్కడ ట్రెక్కింగ్ చేస్తూ, ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంటూ సినిమా కోసం తనను తాను సిద్ధం చేసుకుంటున్నట్లు మహేష్ వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రముఖ ట్రైనర్ హ్యారీతో కలిసి దిగిన ఫోటోలను కూడా పంచుకున్నారు. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ ఫారెస్ట్ జర్మనీలోని అత్యంత ప్రసిద్ధి చెందిన అటవీ ప్రాంతాలలో ఒకటి. జర్మనీ లోని బాడెన్-వుర్టెంబర్గ్ రాష్ట్రంలో ఉన్న ఈ ప్రాంతం ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ సరిహద్దులకు సమీపంలో ఉంటుంది. ప్రకృతి సౌందర్యం, కొండలు, లోయలు, సరస్సులు, వన్యప్రాణులతో ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది.
ఇదే ప్రాంతానికి మహేష్ బాబు గతంలో కూడా వెళ్లారు. 2024లో ‘గుంటూరు కారం’ సినిమా విడుదల అనంతరం కూడా ఆయన ఇక్కడ ట్రెక్కింగ్ చేస్తూ కనిపించారు. ఇప్పుడు మళ్లీ అదే ప్రాంతంలో ట్రైనింగ్ తీసుకోవడం గమనార్హం. ‘వారణాసి’ సినిమా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో యాక్షన్ అడ్వెంచర్ కథతో రూపొందుతున్నట్లు సమాచారం. తదుపరి షెడ్యూల్ షూటింగ్ అంటార్కిటికాలో జరుగుతుందని వార్తలు వస్తుండగా, అందుకోసమే మహేష్ ముందస్తుగా ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నారని భావిస్తున్నారు.
ఇక ఈ సినిమాను అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిస్తున్నారు. నిర్మాత ఎస్ఎస్ కార్తికేయ ఇటీవల ఇచ్చిన సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని స్పానిష్ భాషలో కూడా విడుదల చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ‘వారణాసి’ కోసం మహేష్ బాబు చేస్తున్న ప్రిపరేషన్, విదేశాల్లో తీసుకుంటున్న ట్రైనింగ్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.