తెలుగు ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత ఒక వారం రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర చూపిస్తున్నాయి. భారీ టికెట్ల కారణంగా ఈ మధ్యకాలంలో ఆడియన్స్ థియేటర్స్కు రావడం మానేశారు. అయితే చాలా రోజుల తర్వాత తక్కువ టికెట్ రేట్లతో విడుదలైన మేజర్, విక్రమ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్స్ తీసుకొస్తున్నాయి. దాదాపు 20 ఏళ్లుగా కమర్షియల్ సక్సెస్ లేని కమల్ హాసన్.. 6 రోజుల్లోనే 200 కోట్ల క్లబ్బులో చేరిపోయాడు. మరోవైపు వరుస విజయాలతో జోరుమీదున్న అడివి శేష్.. మేజర్ సినిమాతో మరోసారి సంచలన విజయం ఖాతాలో వేసుకున్నాడు.
ఈ రెండు సినిమాలకు మరో ప్రత్యేకత కూడా ఉంది. వీటి వెనుక ఇద్దరు హీరోలు నిర్మాణ బాధ్యతలు ఉన్నాయి. మేజర్ కథ నచ్చి మహేశ్ బాబు ఈ సినిమా ప్రొడక్షన్లో భాగం అయ్యాడు. అంతేకాదు సినిమా ప్రమోషన్స్లో కూడా బాగానే పాల్గొన్నాడు సూపర్ స్టార్. తెలుగు, హిందీలో ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగులో అయితే ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అవ్వడమే కాకుండా లాభాల బాటపట్టింది మేజర్.
మరోవైపు కమల్ హాసన్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన విక్రమ్ సినిమా కూడా సంచలన విజయం సాధించింది. ఈ సినిమా తెలుగు హక్కులను 7 కోట్లకు నితిన్ సొంతం చేసుకున్నాడు. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయిన ఈ సినిమా.. నాలుగో రోజు నుంచి లాభాల పంట పండిస్తుంది. ఈ రెండు సినిమాల విజయాలతో తెలుగు ఇండస్ట్రీ కూడా కళకళలాడిపోతోంది. ఎందుకంటే తక్కువ టికెట్లతో వస్తే థియేటర్స్ రావడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పకనే చెప్పారు ప్రేక్షకులు.