జీవన ప్రయాణంలో ఎదురైన అనుహ్య మలుపుల వల్ల ప్రాణస్నేహితులైన ఇద్దరు వ్యక్తులు బద్ద శత్రువులుగా ఎలా మారారు? ఒకరిపై ఒకరు ప్రతీకారం తీర్చుకునేందుకు ఏం చేశారు? చివరకు వారి జీవితం ఏ తీరానికి చేరిందో తెలుసుకోవాలంటే ‘మహాసముద్రం’ సినిమా చూడాల్సిందే అంటున్నారు అజయ్ భూపతి. ఆయన దర్శకత్వంలో శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 14న ప్రేక్షకులముందుకు రానుంది. ఈ నెల 23న ట్రైలర్ను విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా సోమవారం కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ‘ప్రేమ, యాక్షన్ అంశాలు కలబోతగా భావోద్వేగభరితంగా సాగే కథ ఇది. శర్వానంద్, సిద్ధార్థ్ పాత్రలు పోటాపోటీగా సాగుతాయి’ అని చిత్రబృందం తెలిపింది. అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాజ్ తోట, సంగీతం: చైతన్యభరద్వాజ్, సహనిర్మాత: అజయ్ సుంకర, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, రచన-దర్శకత్వం: అజయ్భూపతి.